మోదీ సర్కార్కు సీజేఐ ఎన్వీ రమణ బెంచ్ భారీ ఊరట: ఆ సీల్డ్ కవర్లో ఏముంది..?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిగ్ హ్యాకింగ్ స్కాండల్..పెగాసస్ స్పైవేర్. వేర్వేరు రంగాలకు చెందిన పలువురు బిగ్ షాట్స్ ఫోన్లు హ్యాక్ అయ్యాయి. బాధితుల జాబితాలో కొందరు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రభుత్వ అధికారులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. జర్నలిస్టుల ఫ్లోనూ వదల్లేదు హ్యాకర్లు. మొత్తంగా 300 మందికి పైగా పెగాసస్ స్పైవేర్ బాధితుల జాబితాలో ఉన్నారు. ప్రత్యేకించి- యాపిల్ ఐఫోన్ వినియోగించే వారి నంబర్లను సులభంగా హ్యాక్ అయినట్లుగా అప్పట్లో వార్తలొచ్చాయి.

ఫోన్లు హ్యాక్..
ఇజ్రాయెల్కు చెందిన స్పైవేర్ పెగాసస్ (spyware Pegasus)ను ప్రయోగించడం ద్వారా హ్యాకర్లు.. వారి ఫోన్ నంబర్లను పట్టేశారు. ఈ 300 మంది బాధితుల జాబితాలో ఇద్దరు కేంద్రమంత్రులు, మాజీ మంత్రులు, ముగ్గురు ప్రధాన ప్రతిపక్ష నేతలు, 40 మంది జర్నలిస్టులు, దేశ భద్రత వ్యవస్థకు ప్రధాన అధిపతి, పలువురు వ్యాపారవేత్తలు ఉన్నట్లు ది వైర్ వెబ్సైట్ను ఉటంకిస్తూ జాతీయ మీడియా ప్రత్యేక కథనాలను ప్రచురించింది.

ఇజ్రాయెల్ స్పై సాఫ్ట్వేర్..
2018-2019 మధ్యకాలంలో ఈ హ్యాక్ చోటు చేసుకున్నట్లుగా, 2019 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఫోన్లు హ్యాకింగ్కు గురైనట్లు అంచనా వేసింది. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ రూపొందించిన స్పైవేర్ పెగాసస్ను హ్యాకింగ్ కోసం వినియోగించినట్లు ఆ వెబ్సైట్ స్పష్టం చేసింది. తాము రూపొందించిన స్పైవేర్ పెగాసస్ను ప్రయోగించి ఈ హ్యాకింగ్కు పాల్పడినట్లు వచ్చిన వార్తలను ఎన్ఎస్ఓ గ్రూప్ తోసిపుచ్చింది.

సుప్రీంలో పిటీషన్..
పెగాసస్ స్పైవేర్ను తాము ఇదివరకే విక్రయించామని, ప్రభుత్వ అవసరాల కోసం మాత్రమే పరిమితంగా దాన్ని వినియోగిస్తోన్నారని స్పష్టం చేసింది. ఫోన్ల హ్యాకింగ్ వార్తలను కేంద్ర ప్రభుత్వం కూడా తోసిపుచ్చింది. 300 మందికి పైగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయనడానికి సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది.దీనిపై- కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సమగ్ర విచారణ జరిపించేలా ఆదేశాలను జారీ చేయాలంటూ పిటీషన్లను దాఖలు చేశారు.

సీల్డ్ కవర్లో తుది నివేదిక..
పెగాసస్ స్పై వేర్ కుంభకోణంలో నిజనిజాలను వెలికి తీయడానికి అప్పట్లో సుప్రీంకోర్టు- ఫోరెన్సిక్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ వీ రవీంద్రన్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అలోక్ జోషి, సందీప్ ఒబెరాయ్ను ఇందులో సభ్యులుగా నియమించింది. హ్యాక్కు గురైనట్లుగా అనుమానించిన 29 ఫోన్లను ఈ కమిటీ క్షుణ్నంగా పరిశీలించింది. సీల్డ్ కవర్లో తుది నివేదికను అందించిందీ కమిటీ.

పెగాసస్ ఆధారాల్లేవ్..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పు వినిపించింది. పెగాసస్ స్పై వేర్ను ప్రయోగించినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఫోరెన్సిక్ కమిటీ నివేదిక ఇచ్చినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ 29లో ఫోన్లల్లో అయిదు ఫోన్లు మాల్వేర్ అటాక్కు గురి అయ్యాయని, అది పెగాసస్ స్సైవేర్ ద్వారా సంభవించినట్లు నిర్ధారించడానికి తగిన సాక్ష్యాధారాలేవీ లభించలేదని వివరించింది.

సహకరించకపోవడం పట్ల..
ఈ కమిటీ విచారణ సమయంలో తమకు కేంద్ర ప్రభుత్వం పెద్దగా సహాయ, సహకారాలు అందలేదని ఈ నిపుణుల కమిటీ తన సీల్డ్ కవర్ నివేదికలో స్పష్టం చేసింది. దీనిపట్ల సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎందుకు సహకరించలేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. ఇప్పుడు కూడా అదే స్టాండ్ను తీసుకున్నట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ నివేదికను వెబ్సైట్లోకి అప్లోడ్ చేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications