గడ్డి పువ్వు వర్సెస్ కమలం: అయిదు రాష్ట్రాలు.. అయినా ఆ ఒక్కదానిపైనే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతోంది. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎవరు విజేతలు? ఎవరు పరాజితులనేది ఈ మధ్యాహ్నానికి తేలిపోనుంది. అదే సమయంలో ఏపీలోని తిరుపతి లోక్సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నిక ఫలితాలు కూడా వాటితోపాటు వెల్లడి కానున్నాయి.

బెంగాల్ మీదే
ఓట్ల లెక్కింపు సందర్భంగా అందరి కళ్లూ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ మీదే నిలిచాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ను ఓడించడానికి భారతీయ జనతాపార్టీ సర్వశక్తులనూ ఒడ్డటమే దీనికి కారణం. తృణమూల్ కాంగ్రెస్ వరుసగా రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ.. ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఆ రాష్ట్ర అధికార పగ్గాలను అందుకున్నారు. వరుసగా మూడోసారి కూడా జెండా ఎగరేస్తారా? లేదా? అనేది ఈ మధ్యాహ్నానికి తేలిపోనుంది.

బీజేపీ ఓటుబ్యాంకు..
మొన్నటి ఎగ్జిట్ పోల్స్ కూడా మమతా బెనర్జీ వైపే మొగ్గు చూపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీకి నిరాశ తప్పకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. ఇదివరకటి కంటే తన ఓటుబ్యాంకును, ఓట్ల శాతాన్ని బీజేపీ భారీగా పెంచుకోగలిగినప్పటికీ- ప్రతిపక్ష స్థానానికే పరిమితమౌతాయని అంచనా వేశాయి. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓడిపోయే అవకాశాలే అధికంగా ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడం.. ఈ హోరాహోరి పోరును మరింత ఆసక్తికరంగా మార్చింది.

వారిద్దరూ లేని ఎన్నికలు..
ఇద్దరు రాజకీయ దురంధరులు, మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలిత లేని ఎన్నికలను తమిళనాడు అసెంబ్లీ ఎదుర్కొంది. ఆ ఇద్దరు నేతల వారసులుగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, డీఎంకే అధినేత, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ఈ ఎన్నికల్లో తలపడ్డారు. ఎప్పట్లాగే డీఎంకే-కాంగ్రెస్ కూటమి ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. ఏఐఏడీఎంకే.. బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో దిగింది. ఎగ్జిట్ పోల్స్ డీఎంకే వైపే మొగ్గు చూపాయి. కేరళలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సారథ్యంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి.

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కఠిన ఆంక్షలు..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ బలంగా వీస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహిస్తోన్నఓట్ల లెక్కింపు కావడం వల్ల కేంద్ర ఎన్నికల కమిషన్ అనేక కఠిన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల ముందుజాగ్రత్త చర్యలను చేపట్టింది. లెక్కింపు పూర్తయిన తరువాత గెలిచిన అభ్యర్థులు నిర్వహించే విజయోత్సవాలను నిషేధించింది. అలాగే- ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అభ్యర్థులను గానీ, వారి ఏజెంట్లను గానీ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి ప్రవేశించడానికి అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications