నిధి కోసం బాలుడి నరబలి: తల, మొండం వేరు
అసోం: నిధి కోసం బాలుడిని అతి దారుణంగా హత్య చేసిన సంఘటన అసోం రాష్ట్రంలో జరిగింది. దేవాలయం దగ్గర బాలుడి తల, మొండెం వేరే చేసి రాక్షసంగా ప్రవర్థించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
అసోం రాష్ట్రంలోని సోనిత్ పూర్ జిల్లాలోని రామ్ పార గ్రామం సమీపంలోని తరుంజలి తేయాకు (టీ ఎస్టేట్) తోటలో బుధవారం రాత్రి ఐదు సంవత్సరాల బాలుడి తల పూర్తిగా నరికి వేశారు. తల ఒక వైపు మొండం ఒక వైపు విసిరివేశారు.
విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తేయాకు తోటలో అనుమానస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని పట్టుకుని చితకబాది చెట్టుకు కట్టివేశారు. ఆ వ్యక్తి పేరు ననుమీర్దా అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
తేయాకు తోటలోని దేవాలయం దగ్గర నను మీర్దా పూజలు చేశాడని, అక్కడ కొన్ని విగ్రహాలు బయటపడ్డాయని పోలీసులు అన్నారు. విగ్రహాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. నిధి కోసం ఆశతోనే బాలుడిని దారుణంగా హత్య చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.