సి-ఓటర్ సర్వేను సస్పెండ్ చేశాం: ఇండియా టుడే
న్యూఢిల్లీ: సి-ఓటర్స్ పోలింగ్ ఏజెన్సీ ద్వారా ఇప్పటి వరకు వెల్లడించిన అన్ని ఓపినియన్ పోల్స్ను సస్పెండ్(నిలిపివేస్తున్నట్లు) చేస్తున్నట్లు ఇండియా టుడే గ్రూప్ మంగళవారం ప్రకటించింది. పలు ఏజెన్సీలు డబ్బుల కోసమే ఓపినియన్ పోల్స్ నిర్వహిస్తున్నట్లు ఓ టెలివిజన్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో బయటపడటంతో ఇండియా టుడే గ్రూప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అన్ని ఆరోపణలను పరిశీలించిన తర్వాతే స్టింగ్ ఆపరేషన్ను సీరియస్గా తీసుకున్నట్లు ఇండియా టుడే ప్రకటించింది. ఇండియా టుడే గ్రూప్ కోసం సి-ఓటర్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని ఓపినియన్ పోల్స్ను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. అంతేగాక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన ఛానల్ ఆరోపణలపై సి-ఓటర్ ఏజెన్సీకి షోకాజు నోటీసు కూడా పంపించామని పునీత్ జైన్ నేతృత్వంలోని ఇండియా టుడే గ్రూప్ వెల్లడించింది.
తాము నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో 11 పోల్ ఏజెన్సీల బండారం బట్టబయలైందని న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ వినోద్ కాప్రి తెలిపారు. డబ్బుల కోసమే ఈ ఏజెన్సీలు ఓపినియన్ పోల్స్ను తారుమారు చేస్తున్నాయని వెల్లడించారు. తమ స్టింగ్ ఆపరేషన్ వివరాలను ఎన్నికల కమిషన్ ముందు ఉంచుతామని వినోద్ కాప్రి తెలిపారు. ఆపరేషన్లో భాగంగా మరికొన్ని పోల్ ఏజెన్సీలను సంప్రదించగా అవి స్పందించలేదని చెప్పారు.
కాగా, ఈ స్టింగ్ ఆపరేషన్తో సి-ఓటర్ సంస్థపైనా, అది చేసిన సర్వేలపైనా సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే.. సి-ఓటర్ పోల్ ఏజెన్సీ అధిపతి యశ్వంత్ దేశ్ముఖ్ మాత్రం "(దీనిపై) మా న్యాయవాదులు ఏం చేయాలో అది చేస్తారు. నేనేం చేయాలో అది చేస్తాను. నా బృందం ఏం చేయాలో అది చేస్తుంది. ప్రస్తుతానికి మేం.. మా తదుపరి పోల్ నిర్వహణలో బిజీగా ఉన్నాం :)'' అని ట్విట్టర్లో పేర్కొన్నారు.