ఈ ధరలకే టికెట్లు అమ్మాలి: విమానయాన సంస్థలకు తేల్చేసిన కేంద్రం, కొత్త గైడ్లైన్స్
న్యూఢిల్లీ: దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే మూడు నెలలపాటు పౌర విమానయాన శాఖ నిర్దేశించిన టికెట్ ధరలనే అనుసరించాలని ఆ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ విమానయాన సంస్థలకు స్పష్టం చేశారు.

ఏడు కేటగిరీల్లో ధరల నిర్ణయం..
సుమారు 2 నెలల తర్వాత మే 25 నుంచి దేశీయ పౌర విమాన సేవలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. విమాన ప్రయాణ సమయం ఆధారంగా ధరలను ఏడు కేటగిరీలుగా విభజించినట్లు వెల్లడించారు. ఒకటో కేటగిరి: 0-40 నిమిషాలు, రెండో కేటగిరి: 40-60 నిమిషాలు, మూడోకేటగిరి: 60-90 నిమిషాలు, నాలుగో కేటగిరి: 90-120 నిమిషాలు, ఐదో కేటగిరి: 120-150 నిమిషాలు, ఆరో కేటగిరి: 150-180 నిమిషాలు, ఏడో కేటగిరి: 180-210 నిమిషాలు అని విభజించినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

ఢిల్లీ-ముంబైకి గరిష్టం 10వేలు కానీ..
ఉదాహరణకు ఢిల్లీ-ముంబై మధ్య విమాన ప్రయాణానికి కనిష్ట ధర రూ. 3500, గరిష్ట ధర రూ. 10వేలు. రాబోయే మూడు నెలలపాటు ఈ ఛార్జీలు అమలులో ఉంటాయని హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. అంతేగాక, విమానంలోని కనీసం 40 శాతం సీట్లు కనిష్ట, గరిష్ట సగటు ధరకు విక్రయించాలన్నారు.. అంటే ఢిల్లీ-ముంబై రూట్లో రూ. 6700 కంటే తక్కువకు 40 శాతం టికెట్లు అమ్మాలని తెలిపారు.
Recommended Video

ఆహారానికి అనుమతి లేదు.. ఆరోగ్యసేతు లేకున్నా..
సోమవారం నుంచి మూడోవంతు విమానాలను ప్రయాణానికి అనుమతిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. అయితే, ఆహార పదార్థాలకు అనుమతివ్వమని అన్నారు. మధ్య సీట్లు అనుమతించినంత మాత్రాన భౌతిక దూరం సాధ్యపడదు కాబట్టి సీట్లు విడిచిపెట్టడం లేదని ఆయన వెల్లడించారు. విదేశాల్లోని భారతీయులను తీసుకొచ్చే వందే భారత్ మిషన్లో ప్రైవేటు విమానయాన సంస్థలు కూడా పాల్గొనవచ్చని మంత్రి చెప్పారు. అంతకుముందు జారీ చేసిన నిబంధనల్లో ఆరోగ్య సేతు యాప్ ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తామని పౌర విమానయాన శాఖ తెలిపింది. అయితే, ఆరోగ్య సేతు యాప్ లేనప్పటికీ ప్రయాణికుల నుంచిసెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని ప్రయాణానికి అనుమతిస్తామని కేంద్రమంత్రి హర్దీప్ తెలిపారు.












Click it and Unblock the Notifications