Mohammed Zubair : ఫ్యాక్ట్ చెకర్ మొహమ్మద్ జుబైర్ కు సుప్రీంలో ఊరట- బెయిల్ పొడిగింపు
మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో నమోదైన కేసులో ఫ్యాక్ట్ చెకర్ మహ్మద్ జుబేర్కు సుప్రీంకోర్టు ఇవాళ ఊరటనిచ్చింది. ఆయనకు గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ను పొడిగించింది.అయితే, ఈ ఉపశమనం సీతాపూర్ కేసుకు మాత్రమే పరిమితం చేసింది. ఢిల్లీ, యూపీలోని లఖింపూర్లో ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడిపై చర్యలు ప్రభావితం కావని తెలిపింది. అంటే ఆయన ఇంకా జైల్లోనే ఉంటాడని అర్దం.
జుబైర్ను యూపీ కోర్టు జూలై 14 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో ఆయన న్యాయవాది కోలిన్ గోన్సాల్వేస్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ మరియు జెకె మహేశ్వరితో కూడిన వెకేషన్ బెంచ్ ముందు హాజరైన గోన్సాల్వేస్ తక్షణ విచారణను కోరారు. ఆ తర్వాత కోర్టు జుబైర్కు ఐదు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఇవాళ యూపీ పోలీసు న్యాయవాది ఎస్వి రాజు, జస్టిస్ డివై చంద్రచూడ్, ఎఎస్ బోపన్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణలో జుబైర్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.దీంతో నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని యూపీ పోలీసులను సుప్రీంకోర్టు సూచించింది. అలాగే ఫ్యాక్ట్ చెకర్కు మంజూరైన మధ్యంతర బెయిల్ను పొడిగించింది. ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 7న జరగనుంది.
సీతాపూర్ కేసులో పోలీసులు జుబైర్పై మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. మేలో "ద్వేషపూరిత" యతి నరసింహానంద సరస్వతి, బజరంగ్ ముని, ఆనంద్ స్వరూప్ వంటి హిందూ నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపించిన ట్వీట్ను ఉదహరించారు. అక్కడ నమోదైన కేసుకు సంబంధించి జుబైర్ను సీతాపూర్కు తీసుకెళ్లారు. అయితే గత రాత్రి తిరిగి ఢిల్లీలోని తీహార్ జైలుకు తీసుకువచ్చారు.
ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ప్రవక్త మొహమ్మద్పై ఇప్పుడు సస్పెండ్ అయిన బీజేపీ నేత నుపుర్ శర్మ రెచ్చగొట్టే వ్యాఖ్యల వీడియోను ఫ్లాగ్ చేసిన కొద్ది రోజుల తర్వాత నాలుగు సంవత్సరాల నాటి ట్వీట్పై ఢిల్లీ పోలీసులు జూన్ 27న అరెస్టు చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని, శత్రుత్వాన్ని ప్రోత్సహించారని ఢిల్లీ పోలీసులు జుబైర్పై అభియోగాలు మోపారు. ఢిల్లీ కోర్టు జూలై 2న ఆయనను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఈ అంశంపై గురువారం విచారణ జరగనుంది.