అది ‘త్రీ ఇడియట్స్’ కూటమి: మోడీ సెటైర్
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ‘త్రీ ఇడియట్స్' సినిమాలోని పాటను ఆలపిస్తూ తనపై చేసిన వ్యాఖ్యలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం దీటుగా బదులిచ్చారు. అంతేగాక, మహాకూటమిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన జెడి(యు)-ఆర్జెడి-కాంగ్రెస్లను ‘త్రీ ఇడియట్స్'గా అభివర్ణించారు.
మంగళవారం సీతామర్హిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ ప్రసంగించారు. నితీశ్ కుమార్కు ‘ముషాయిరా' కళ బాగా నప్పుతుందని పేర్కొన్న మోడీ.. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత నితీష్ తీరిగ్గా ఈ కళను సాధన చేయాలని సూచించారు. అలాగే నితీశ్తో చేతులు కలిపిన ఆర్జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్పై కూడా నిప్పులు చెరిగారు.

లాలూను ఎప్పటి నుంచో గమనిస్తున్నానని, చాలా ఏళ్ల తర్వాత ఆయన బీహార్ ప్రజలకు గొప్ప వినోదాన్ని అందిస్తున్నారని, అయితే నేరస్థులను కాపాడటం, ఆశ్రీత పక్షపాతానికి పాల్పడటం వంటి అనేక అంశాలపై లాలూకు, నితీష్కు మధ్య ఇప్పటికీ బద్ధ వైరం కొనసాగుతోందని, ప్రస్తుతం వీరు ప్రజలకు వినోదాన్ని అందించడంలోనూ పోటీ పడుతున్నారని మోడీ అన్నారు.
‘నితీశ్ సోమవారం ముషాయిరా ఇవ్వడాన్ని నేను చూశా. పాత్రికేయులను పిలిచి కొన్ని పద్యాలు పాడటం ద్వారా కొత్త రకం వినోదాన్ని మొదలుపెట్టి లాలూను ఓడించాలని ఆయన భావించారు.
మహాకూటమిలో జెడి(యు), ఆర్జెడి, కాంగ్రెస్ పార్టీలు భాగస్వాములుగా ఉన్నప్పటికీ నితీశ్ కుమార్ తన తొలి ముషాయిరాకు ‘త్రీ ఇడియట్స్' సినిమాలోని పాటను ఎంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పేరడీ పద్యాన్ని ఆలపించాలనుకునే వారెవరికైనా తొలుత ఈ త్రీ ఇడియట్లే మదిలో మెదులుతారు' అని మోడీ అన్నారు.












Click it and Unblock the Notifications