దెప్పి పొడిచిన ప్రశాంత్ కిశోర్..!!
పాట్నా: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, వాయనాడ్ లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతోంది. ఈ యాత్ర ప్రస్తుతం హర్యానాలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సొంత జిల్లా కురుక్షేత్ర, కర్నాల్ లల్లో యాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. కనీస మద్దతు ధర కోసం ఆందోళనలను చేపడుతోన్న చెరకు రైతులను ఆయన కలుసుకున్నారు. వారి సాధకబాధకాలను ఆలకించారు.
ఉత్తరాదిని తీవ్రమైన చలి, పొగమంచు వణికిస్తోన్నప్పటికీ- రాహుల్ గాంధీతో కలిసి అడుగులో అడుగు వేయడానికి వస్తోన్న వారి సంఖ్య ఎక్కడే గానీ తగ్గట్లేదు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఆయన కూడా వెనుకంజ వేయట్లేదు. ఈ తెల్లవారు జామున ఆయన కర్నాల్లోని నీలోఖేరి ప్రాంతంలోని దోడ్వా నుంచి భారత్ జోడో యాత్రను పునఃప్రారంభించారు. పార్టీ సీనియర్ నేతలు భూపిందర్ సింగ్ హుడా, రణదీప్ సింగ్ సూర్జేవాలా, కుమారి సెల్జాలు ఇందులో పాల్గొన్నారు.
ఈ పరిణామాల మధ్య భారత్ జోడో యాత్రపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. బిహార్ లో ప్రశాంత్ కిశోర్ కూడా జన్ సురాజ్ యాత్రను కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ లో ఆయన ఈ యాత్రను ప్రారంభించారు. భారత్ జోడో యాత్ర- జన్ సురాజ్ యాత్రను పోల్చుతూ వచ్చిన వార్తలపై స్పందించారు. రాహుల్ గాంధీపై సెటైర్లు సంధించారు.
వాళ్లు (రాహుల్ గాంధీ) పెద్ద మనుషులు. నేను అంతటివాడిని కాను.. అంటూ వ్యాఖ్యానించారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడవాలని, 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని తానేమీ లక్ష్యాలను నిర్దేశించుకోలేదని పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి తాను బిహార్ లోని ప్రతి మారుమూల గ్రామాన్నీ కలుస్తున్నానని, నాన్ స్టాప్ గా పాదయాత్ర చేస్తోన్నానని చెప్పారు. ఇన్ని కిలోమీటర్లే నడవాలని గిరి గీసుకోలేదని చెప్పారు.
తన ఫిట్ నెస్ కంటే కూడా ప్రజల ఆర్థిక బలోపేతానికి ప్రాధాన్యత ఇస్తోన్నానని చురకలు అంటించారు. ఈ యాత్రకు తన శారీరక, మానసిక దృఢత్వాన్ని సాక్ష్యంగా చూపించాల్సిన అవసరం లేదని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. అధికార జేడీయూ-ఆర్జేడీ నాయకులు తనను అవకాశవాదిగా విమర్శించడాన్ని తప్పు పట్టారు. రాహుల్ గాంధీ లాగా కొత్త సంవత్సరం సందర్భంగా విశ్రాంతి తీసుకోదలచుకోలేదని, బ్రేక్ ఇవ్వడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదనీ వ్యాఖ్యానించారు.