హర్యానా మాజీ సీఎం చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్ష-50 లక్షల జరిమానా-అక్రమాస్తుల కేసులో
హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీఎంగా పనిచేసిన కాలంలో అక్రమాస్తులు అర్జించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చౌతాలాను దోషిగా నిర్ధారించిన ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు.. నాలుగేళ్ల జైలుశిక్షతో పాటు 50 లక్షల రూపాయల జరిమానా కూడా విధిస్తూ ఇవాళ తీర్పునిచ్చింది.
87 ఏళ్ల చౌతాలాను గత శనివారం మే 21న అక్రమాస్తుల కేసులో ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు దోషిగా నిర్ధారించింది. వైద్యపరమైన అనారోగ్యాలు, వృద్ధాప్యం దృష్ట్యా తనకు కనీస శిక్ష విధించాలని చౌతాలా కోర్టును కోరారు.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అయితే, దోషికి గరిష్టంగా శిక్షించాలని కోరింది. ఇది సమాజానికి ఓ సంకేతం పంపుతుందని కూడా కోర్టు దృష్టికి తెచ్చింది. దీంతో ఆయన విజ్ఞవ్తిని పరిశీలించిన న్యాయస్ధానం నాలుగేళ్ల జైలు రూ.50 లక్షల జరిమానా విధించింది.
జైలు శిక్ష, జరిమానాతో పాటు చౌతాలాకు చెందిన నాలుగు ఆస్తులను జప్తు చేయనున్నట్లు కోర్టు ఇవాళ తన తీర్పు సందర్భఁగా ప్రకటించింది. హేలీ రోడ్, పంచకుల, గురుగ్రామ్, అసోలాలోని ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత ఆస్తులు అటాచ్ చేయనున్నారు. 1993 నుంచి 2006 మధ్య కాలంలో చట్టబద్ధమైన ఆదాయానికి భిన్నంగా రూ.6.09 కోట్ల ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై 2005లో చౌతాలాపై సీబీఐ కేసు నమోదు చేసి మార్చి 26, 2010న ఛార్జిషీట్ దాఖలు చేసింది. జనవరి 2021లో, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి చౌతాలాపై ఢిల్లీ కోర్టు మనీలాండరింగ్ అభియోగాలు మోపింది.












Click it and Unblock the Notifications