హర్యానా రాజకీయాల్లో ట్విస్ట్-జైలు నుంచి విడుదలైన ఓం ప్రకాష్ చౌతాలా- రైతులకు మద్దతు
హర్యానా రాజకీయాల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా పదేళ్ల జైలు శిక్ష అనంతరం ఇవాళ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కాంలో దోషిగా నిరూపణ కావడంతో ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడింది. అప్పటి నుంచి జైలు జీవితం గడుపుతున్న చౌతాలా ఇవాళ తిరిగి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టారు.
తీహార్ జైలు నుంచి విడుదలైన చౌతాలాకు ఆయన మద్దతుదారులు భారీ ఎత్తున తరలివచ్చి ఢిల్లీ-గుర్గావ్ సరిహద్దుల్లో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన చౌతాలా కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతు ప్రకిటంచారు. రైతుల కు అండగా ఉంటామని చౌతాలా వెల్లడించారు.పేదలు, బలహీన వర్గాలు, రైతులకు మద్దతుగా ప్రభుత్వాలపై తన పోరాటం కొనసాగుతందని చౌతాలా తెలిపారు. ప్రస్తుతం డాక్టర్ల సూచన మేరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటానని, ఆ తర్వాత రైతుల నిరసనల ప్రాంతాలకు వెళ్లి సంఘీభావం తెలుపుతానని చౌతాలా పేర్కొన్నారు.
2013లో చౌతాలా హర్యానాలో ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన జూనియర్ టీచర్ల రిక్రూట్ మెంట్ స్కాంలో దోషిగా తేలడంతో జైలుకు వెళ్లారు. కరోనా కారణంగా గతేడాది మేలో అత్యవసర పెరోల్ పై ఆయన బయటికి వచ్చారు. చౌతాలా మనవడు అయిన దుష్యంత్ చౌతాలా ప్రస్తుతం హర్యానా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే హర్యానాలోని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం రైతులపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా తాత అయిన ఓం ప్రకాష్ చౌతాలా రైతులకు మద్దతు ప్రకటించడం విశేషం. ఈ పరిణామం హర్యానాలోని సంకీర్ణ ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశాలూ లేకపోలేదు.