Dr KK Aggarwal: కరోనాతో ఐఎంఏ మాజీ అధ్యక్షుడు కన్నుమూత: రెండు డోసులూ తీసుకున్నా
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. అత్యంత ప్రమాదకరంగా మారింది. లక్షలాదిమంది ఉసురు తీస్తోంది. పలువురు ప్రముఖుల ప్రాణాలను హరించి వేస్తోంది. తాజాగా- ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కేకే అగర్వాల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. కరోనా బారిన పడిన ఆయన దేశ రాజధానిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (AIIMS)లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల దేశవ్యాప్తంగా డాక్టర్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోన్నారు. తమ మార్గదర్శకుడిని కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు.
దేశంలో కరోనా డెత్స్ పీక్స్లో: ఒక్కరోజులో అత్యధిక మరణాలు: 2.5 కోట్లు దాటిన కేసులు
డాక్టర్ కేకే అగర్వాల్.. ఇదివరకే రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినప్పటికీ- కొద్దిరోజుల కిందట ఆయన కరోనా వైరస్ సోకింది. అనారోగ్యానికి గురైన ఆయన ఎయిమ్స్లో అడ్మిట్ అయ్యారు. ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది. దీనితో ఆయనను ప్రత్యేక చికిత్సను అందిస్తూ వచ్చారు డాక్టర్లు. అత్యాధునిక వైద్యాన్ని అందించారు. అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. మరింత విషమించింది. దీనితో వారం రోజులుగా వెంటిలేటర్పై ఉంచారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
ఆయన మరణం పట్ల దేశవ్యాప్తంగా పలువురు డాక్లర్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోన్నారు. సంతాపం తెలుపుతోన్నారు. డాక్టర్ అగర్వాల్.. టాప్ కార్డియాలజిస్ట్. హార్ట్ కేర్ ఫౌండేషన్ ఇండియా అధిపతిగా సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. 2010లో ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. అంతకంటే ముందు- 2005లో డాక్టర్ బీసీ రాయ్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఢిల్లీలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ యూనివర్శిటీ నుంచి ఎంబీబీఎస్ పట్టా అందుకున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచీ.. దాన్ని నివారించడానికి, కరోనా బారి నుంచి వేగంగా కోలుకోవడానికి అవసరమైన సూచనలు చేస్తూ సోషల్ మీడియాలో పలు వీడియోలను పోస్ట్ చేస్తూ వచ్చారు.
Recommended Video