సీజేఐకు న్యాయ ప్రముఖుల లేఖ - సుమోటోగా స్వీకరించండి : వ్యాఖ్యలు - కూల్చివేతలు..!!
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు విశ్రాంత న్యాయమూర్తులు.. సీనియర్ న్యాయవాదులు ఒక లేఖ రాసారు. బీజేపీ మాజీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తో పెద్ద దుమారం చెలరేగింది. వారి వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. అయితే, ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు - ఆందోళనలు చేస్తన్న వారి అక్రమ నిర్బంధాలు, కూల్చివేతలను సుమోటో స్వీకరించాలని విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు లేఖల సీజేఐని కోరారు.
ఘటనలు, యూపీ అధికార యంత్రాంగం చేపట్టిన అణిచివేత చర్యలకపైన తాను రాసిన లేఖను అత్యవసర పిటీషన్ గా పరిగణించాలని కోరారు. ఈ లేఖలో సంతకంచేసిన వారిలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి, జస్టిస్ గోపాల గౌడ, జస్టిస్ ఏకే గంగూలీ, దిల్లీ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షా, తమిళనాడు, కర్ణాటక హైకోర్టుల రిటైర్డు న్యాయమూర్తులు జస్టిస్ చంద్రూ, జస్టిస్ మహమ్మద్ అన్వర్ ఉన్నారు. సీనియర్ న్యాయవాదులు శాంతి భూషణ్, ఇందిరా జైసింగ్,శ్రీరామ్ పంచు, ప్రశాంత్ భూషణ్, ఆనంద్ గ్రోవర్లు ఉన్నారు. నిరసనకారుల ఇళ్లను నోటీసులు ఇవ్వకుండా కూల్చేయడం.. వెంబడించి కొట్టటం వంటి వీడియో లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయాన్ని సైతం వారు లేఖలో పేర్కొన్నారు.
యూపీ పోలీసులు 300మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేసిన విషయాన్ని అందులో ప్రస్తావించారు. క్రూరమైన నిర్భందం చేస్తే.. పౌరుల హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని న్యాయ నిపుణులు ఆవేదన వ్యక్తం చేసారు. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను అపహస్యం చేయడమేనని ఈ లేఖలో వివరించారు. వలస కార్మికులు, పెగాసెస్ కేసులను సుప్రీం కోర్టు ఎలా సుమోటోగా స్వీకరించిందో ఈ కేసును అలాగే స్వీకరించాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో న్యాయ నిపుణులు కోరారు.