బహుబాషా నటి రమ్యకు మంత్రి పదవి?
బెంగళూరు: బహుబాషా నటి, మండ్య మాజీ ఎంపీ రమ్యకు కర్ణాటకలో మంత్రి పదవి ఇస్తారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మాజీ పార్లమెంట్ సభ్యురాలు రమ్యను ఎంఎల్ సీని చేసి తరువాత మంత్రి పదవి అప్పగించనున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ మంత్రి వర్గంలో మార్పులు చెయ్యాలని నిర్ణయించారు. పని చెయ్యని మంత్రులను పక్కకు తప్పించి యువతకు ఎక్కువ ప్రధాన్యం ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు.
మంత్రి వర్గంలో మార్పులు చెయ్యడానికి అధిష్టానం అనుమతి తీసుకోనున్నారు. మండ్య నుంచి పార్లమెంట్ ఎన్నికలలో పోటి చేసిన రమ్య ఓడిపోయారు. గతంలో ఒక సారి రమ్యను గెలిపించిన మండ్య ప్రజలు తరువాత ఆమె పని చెయ్యలేదని, కార్యకర్తలను పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఓడించారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దగ్గర రమ్యకు మంచి గుర్తింపు ఉంది. ఈ సందర్బంలో మంత్రి వర్గంలో మార్పులు చేసే సమయంలో రమ్యకు చాన్స్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నది. రమ్యకు ఎంఎల్ సీ సీటు ఇస్తారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నది.
ఇటివల రాహుల్ గాంధీ కర్ణాటకలో పర్యటించిన సమయంలో రమ్యా చాల హుషారుగా పాల్గొన్నారు. తరువాత మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎమ్. కృష్ణతో రమ్య భేటి అయ్యారు. ఈ నేపథ్యంలో రమ్యకు మంత్రి పదవి గ్యారంటీ అని పలువురు సీనియర్లు అంటున్నారు.
మంగళవారం సాయంత్రం రాహుల్ గాంధీతో సిద్దరామయ్య, పరమేశ్వర్ భేటి కానున్నారు. కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ ను మంత్రి పదవి నుంచి తప్పించి సినీ రంగానికే చెందిన రమ్యకు చాన్స్ ఇస్తారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే అంబరీష్తో పెట్టుకుంటే కష్టమని కాంగ్రెస్ కు చెందిన కొందరు అంటున్నారు.