అమిత్ షా మంత్రాంగం - బీజేపీలో విలీనం కానున్న ఆ కాంగ్రెస్ పార్టీ..!!
చండీగఢ్: కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కేప్టెన్ అమరీందర్ సింగ్.. కీలక నిర్ణయం తీసుకున్నారు. భారతీయయ జనతా పార్టీలో చేరబోతోన్నారు. దీనికోసం ముహూర్తాన్ని కూడా ఖాయం చేసుకున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నెలకొల్పిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేయనున్నారు. పార్టీ క్యాడర్ మొత్తం తనతోనే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అమరీందర్ సింగ్ను తొలగించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో చరణ్జీత్ సింగ్ ఛన్నీని అపాయింట్ చేసింది. ఛన్నీ సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంది గానీ- ఎలాంటి ఫలితమూ రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైంది కాంగ్రెస్. 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్కు దిక్కింది సీట్లే. 92 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని అందుకుంది. భగవంత్ మాన్ ముఖ్యమంత్రి అయ్యారు.

తనను తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన అమరీందర్ సింగ్- సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ను నెలకొల్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని మరీ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు అమరీందర్ సింగ్. కొద్దో గొప్పో ఈ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి గానీ అవన్నీ తలకిందులయ్యాయి. ఒక్కస్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. అమరీందర్ సింగ్ సైతం దారుణ పరాజయాన్ని చవి చూశారు. డిపాజిట్ కోల్పోయారు.
అప్పటి నుంచీ పెద్దగా క్రియాశీలకంగా ఉండట్లేదాయన. ఇప్పుడు తాజాగా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 19వ తేదీన దేశ రాజధానిలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువాను కప్పుకోనున్నారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ను కూడా అందులో విలీనం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆహ్వానం మేరకు తాను బీజేపీలో చేరనున్నట్లు అమరీందర్ సింగ్ చెప్పారు.












Click it and Unblock the Notifications