మాజీ కేంద్రమంత్రి, మహారాష్ట్ర మాజీ సిఎం ఏఆర్ అంతులే కన్నుమూత
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఏఆర్ అంతులే(85) మంగళవారం మృతి చెందారు. అనారోగ్యం కారణంగా గత నెల రోజులుగా ముంబైలోని బ్రీచ్కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి ఆయనకు ఇంటెన్సివ్ కేర్ వైద్యం అందించారు.
అయినప్పటికీ, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్ది రోజుల క్రితం ఆయన కోమాలోకి వెళ్లారు. మంగళవారం అంతులే మృతి చెందినట్లు ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. అంతులే తన భార్య నర్గీస్, కుమారుడు నవేద్, కూతుళ్లు నీలం, షబ్నమ్, ముబినాలతో ఉంటున్నారని అల్లుడు ముస్తఖ్ అంతులే తెలిపారు.

తమ సొంత స్థలంలో సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. అంతులే జన్మస్థానమైన రాయ్గఢ్ జిల్లాలోని అంబట్లో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ముస్తఖ్ అంతులే తెలిపారు.
మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపిఏ-1 ప్రభుత్వంలో అంతులే కేంద్రమంత్రిగా పని చేశారు. 1980 నుంచి 82 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. తొలి మహారాష్ట్ర ముస్లీం సిఎంగా ఆయన చరిత్ర సృష్టించారు. ఆయనను దివంగత ప్రధాని ఇందిరా గాంధీ నియమించారు.
కాగా, సొంత ట్రస్టు కోసం నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని బాంబే హైకోర్టు తేల్చి చెప్పడంతో.. ముఖ్యమంత్రి పదవి నుంచి అంతులే బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications