ఫొటో జర్నలిస్ట్ గ్యాంగ్రేప్: దోషులుగా తేలిన నలుగురు
ముంబై: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన ముంబై మహిళా ఫొటో జర్నలిస్టు సామూహిక అత్యాచారం కేసులో గురువారం స్థానిక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించిన నలుగురు నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 2013 ఆగస్టు 22న ముంబైలోని శక్తి మిల్స్ పరిసరాల్లో మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం జరిగింది.
తన విధులలో భాగంగా మిల్స్ పరిసరాలకు వెళ్లిన 23ఏళ్ల మహిళా ఫొటో జర్నలిస్టుపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడరు. అత్యాచారానికి పాల్పడే ముందు ఆమెకు బలవంతంగా పోర్న్ వీడియోలను చూపించారు. అంతేగాక తనతోపాటు వచ్చిన సహాయకుడిని చితకబాదారు. దీంతో తీవ్ర గాయాలైన అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ ఘటన ముంబైలో అప్పుడు సంచలనమైంది. దీంతో నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు.
చివరకు విజయ్ జాదవ్, కాసీమ్ బెంగాలీ, సిరాజ్ రెహమాన్, సలీమ్ అన్సారీ అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన విచారణలో పలు అంశాలను పరిశీలించిన కోర్టు, నిందితులందర్నీ దోషులుగా నిర్ధార్థిస్తూ తీర్పు వెలువరించింది. నిందితులకు వ్యతిరేకంగా ఫోరెన్సిక్ ఆధారాలు, కాల్ డేటా, రికార్డులు, డిఎన్ఏ రికార్డులు ఉన్నాయని విచారణలో పోలీసులకు కోర్టుకు తెలిపారు.
కాగా, ఈ దోషులు గతంలో మరో నలుగురు మహిళలపై కూడా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అయితే, కస్టడీలో ఉన్న సమయంలో నిందితులు భిన్నమైన తేదీలను, వివరాలను చెబుతున్నారని, ఆ సమాచారాన్నంతా క్రోడీకరిస్తే వారు పది మంది మహిళలపై అత్యాచారానికి దిగి ఉంటారనేది అర్థమవుతోందని దర్యాప్తు అధికారి ఒకరు గతంలో మీడియాకు తెలిపారు.