విషాదం : బెలూన్ గ్యాస్ సిలిండర్స్ పేలి నలుగురు మృతి... పలువురికి తీవ్ర గాయాలు...
మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. బెలూన్ గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఈ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. మధ్యప్రదేశ్లోని చింద్వారా,ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఆదివారం(ఆగస్టు 22) చోటు చేసుకున్న ఈ ఘటనల్లో... తాజుద్దీన్ అన్సారీ(70),షేక్ ఇస్మాయిల్(70),గీతాదేవీ(40),లల్లా(30) అనే వ్యక్తులు మృతి చెందారు.వీరిలో ఒకరు గ్యాస్ బెలూన్లు విక్రయించే వ్యక్తిగా చెబుతున్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
చింద్వారా ఘటనపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ.. స్థానిక మార్కెట్లో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఆ సమయంలో భారీ పేలుడు శబ్దానికి మార్కెట్ మొత్తం దద్దరిల్లిందన్నారు. స్థానికంగా గ్యాస్ బెలూన్లు అమ్మే ఓ వ్యక్తి... బెలూన్లలో గ్యాస్ నింపుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. పేలుడు శబ్దంతో మార్కెట్లో ఉన్నవారు అదిరిపోయారని... కాసేపటి వరకు ఏం జరిగిందో తెలియలేదని అన్నారు.
చింద్వారా ఘటనపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై ఇప్పటివరకూ అధికారికంగా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు యూపీలోని వారణాసిలో చోటు చేసుకున్న పేలుడు ఘటనపై కూడా పోలీసులు ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు. స్థానిక డిప్యూటీ కమిషనర్ అమిత్ కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.గాయపడిన కల్లు(32),అలియా(5),నవీన్ కుమార్(19)లకు ప్రాణపాయమేమీ లేదని... ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
Recommended Video
గతంలోనూ పలుచోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. గత నెల జులై 20న గుజరాత్లో ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ పేలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. అహ్మదాబాద్ శివారులోని ఓ ఇంట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి పూట అంతా నిద్రిస్తున్న సమయంలో కిచెన్లోని గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీకైంది. గాఢ నిద్రలో ఉండటంతో ఈ విషయాన్ని వారు గుర్తించలేకపోయారు. అదే సమయంలో ఎవరో ఇంటి తలుపు కొట్టడంతో కుటుంబ సభ్యుల్లో ఒకరు నిద్ర నుంచి లేచి లైట్ ఆన్ చేశారు. అంతే... ఒక్కసారిగా సిలిండర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఇంట్లో ఉన్న 10 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.