పోలీసులే లక్ష్యంగా మావోయిస్టుల దాడులు: నలుగురు మృతి, 7గురికి గాయాలు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి పెట్రేగిపోయారు. దంతెవాడ జిల్లాలోని కిరండోల్- పల్నార్ వద్ద పోలీసులు ప్రయాణిస్తోన్న మైన్ ప్రొటెక్టెడ్ వాహనం లక్ష్యంగా పేలుడు జరిపారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు మరణించగా, ఏడుగురికి గాయాలయ్యాయి.
అత్యంత రక్షణాత్మకంగా రూపొందించిన మైన్ ప్రూఫ్ వాహనాన్ని సైతం ధ్వంసం చేసి, పోలీసుల్ని చంపడం ద్వారా మావోయిస్టులు.. దండకారణ్యంపై తమ పట్టును మరోసారి నిరూపించుకునే ప్రయత్నం చేశారు. మావోయిస్టుల దాడిలో నలుగురు పోలీసులు మృతి చెందిన విషయాన్ని ఎస్పీ కామ్ లోచన్ కశ్యప్ ధృవీకరించారు.
గడిచిన వారం రోజుల్లో పోలీసులపై మావోయిస్టులు దాడి చేయడం ఇది మూడోసారి. గత శనివారం సుకుమా జిల్లాలోని చింతగుఫా అటవీప్రాంతంలో ఏడుగురు ఎస్టీఎఫ్ జవాన్లను మట్టుబెట్టిన మావోయిస్టులు.. శవాలకోసం వెళ్లిన సీర్పీఎఫ్ బలగాలపైనా కాల్పులు జరిపారు.
ఆదివారం కాంకేర్ జిల్లాలోని ఓ ఐరన్ ఓర్ మైన్ వద్ద 17 వాహనాలను తగలబెట్టారు. ఆ క్రమంలోనే ఈ రోజు పోలీసులు ప్రయాణిస్తోన్న వాహనాన్ని ల్యాండ్ మైన్తో పేల్చారు. కాగా, సోమవారం రోజే మరో రెండు చోట్ల మందు పాతరలను పేల్చిన ఘటనల్లో ఒకరు మృతి చెందగా, పలువురు పోలీసులు గాయాలపాలయ్యారు. మావోయిస్టుల దాడిలో గడిచిన 72 గంటల్లో 12 మంది భద్రతాధికారులు మృతి చెందారు.