వీడని బంధం: జైల్లోనూ జయలలితతోనే శశికళ
బెంగళూరు/చెన్నై: కష్టాలైనా.. సుఖాలైనా వారిద్దరు కలిసే పంచుకుంటారు. ఒకరికి బాధ కలిగితే మరొకరు బాధ పడతారు. వారే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, ఆమె శ్రేయోభిలాషి శశికళ. వీరిద్దరూ ప్రస్తుతం ఆస్తులకు మించిన ఆదాయం కేసులో దోషులుగా తేలడంతో జైల్లోనూ కలిసే శిక్ష అనుభవిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు రూ. 100 కోట్ల జరిమానా విధించగా.. శశికళకు రూ. 10 కోట్ల జరిమానాను విధించారు.
వీరిద్దరి పరిచయం ఇంత దృఢ బంధంగా ఎలా ఏర్పడిందనేది ఒక్కసారి పరిశీలిద్దాం. 1982లో విఎస్ చంద్రలేఖ అనే ఐఏయస్ అధికారిణి శశికళను జయలలితకు పరిచయం చేశారు. అప్పుడు జయలలిత రాజ్యసభ ఎంపీగా కొనసాగుతుండగా.. శశికళ ఓ వీడియో పార్లర్ నిర్వహిస్తోంది. శశికళ భర్త నటరాజన్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో పిఆర్వోగా పని చేసేవారు. కాగా, జయలలితతో శశికళ స్నేహం పెరగడంతో పాటు అదే విధంగా ఆమె ఆస్తులు కూడా అదే స్థాయిలో పెరిగాయి.
2011లో శశికళ బంధువులు కొంతమంది జయకు వ్యతిరేకంగా కుట్ర పన్నారన్న వార్తలు వచ్చినప్పుడు వాళ్లనే దూరం చేసుకున్నారు కానీ, జయలలితను వదల్లేదు. అంతేగాక శశికళ భర్త కూడా ఆమెకు కొంత కాలం దూరంగా ఉన్నారు. 1982 నుంచి ఇప్పటి వరకు కేవలం మూడు సందర్భాల్లోనే జయలలితను శశికళ వీడారు. తొలిసారి 1995-96లో ఆమెను జేజేటీవీ పరికరాల దిగుమతి కేసులో ఈడి అరెస్ట్ చేసింది. రెండోసారి 1996 మేలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జయలలితే ఆమెను తన ఇంటి నుంచి పంపించేశారు. ఆ తర్వాత మూడోసారి ఆమె తోపాటు మరో 11మంది బంధువులను 2011లో జయలలిత ఇంట్లోంచి పంపేశారు.
అనంతరం మళ్లీ వీరిద్ధరి మధ్య స్నేహం అలాగే కొనసాగింది. అయితే శశికళకు లభించే అంతటి ప్రాధాన్యతపై పలువురికి ఇప్పటికీ సందేహమే. గత మూడు దశాబ్దాలుగా జయలలిత ఫొటోలు ఎన్ని చూసినా దాదాపు ప్రతీ ఫొటోలు జయలలిత పక్కనే శశికళ కూడా ఉంటారు. జయలలితతో స్నేహ అంటే చాలా కష్టమని, అయితే ప్రతీసారీ శశికళ మాత్రం ఆ కష్టాన్ని అధిగమిస్తూనే ముందుకు సాగారని వారికి సన్నితంగా ఉండే ఓ న్యాయవాది తెలిపారు.