
స్నేహితులు రాకముందే బరాత్.. పెళ్లికొడుకుపై యాభై లక్షల పరువునష్టం దావా వేసిన స్నేహితులు
పెళ్లికి స్నేహితులను ఆహ్వానించిన పెళ్ళికొడుకుకు స్నేహితులు ఊహించని షాక్ ఇచ్చారు. పెళ్లికి పిలిచి తమను అవమానించారని, తమ పరువుకు నష్టం కలిగిందని ఏకంగా స్నేహితుడైన పెళ్ళికొడుకుపై 50 లక్షల రూపాయల పరువు నష్టం దావా వేశాడు. అందరినీ షాక్ కు గురి చేసిన ఈ సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఉత్తరాఖండ్ లో ఘటన,.. స్నేహితులను పిలిచి సమయం కంటే ముందే బారాత్ లో వెళ్ళిన వరుడు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో వివాహం చేసుకుంటున్న ఓ యువకుడు పెళ్లికి తన స్నేహితులను ఆహ్వానించాడు. స్నేహితులతో కలిసి సరదాగా బరాత్ లో డాన్సులు వెయ్యాలని వారికి సమయం కూడా చెప్పాడు. అయితే నిర్ణీత సమయం కంటే ముందుగానే వరుడు స్నేహితులు రాకముందే బరాత్ లో వెళ్ళిపోయాడు. దీంతో స్నేహితులు వరుడు చేసిన పనికి తీవ్రంగా హర్ట్ అయ్యారు. ఐదు గంటలకు బరాత్ అని చెప్పి వరుడు ముందే వెళ్లిపోయాడని అలిగారు. అంతే కాదు ఏకంగా కోర్టు మెట్లు ఎక్కారు.

వరుడిపై పరువు నష్టం దావా వేసిన స్నేహితులు
హరిద్వార్ జిల్లా బహదూరాబాద్ గ్రామానికి చెందిన వరుడు రవి, నిర్ణీత సమయం కంటే ముందుగానే తన పెళ్లి రోజున బరాత్తో వెళ్లి వారిని అవమానించారని అతని స్నేహితులు పరువునష్టం దావా వేశారు. ఇది తమ "పరువు" మీద జరిగిన దాడిగా భావించి, రూ. వరుడి నుంచి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇప్పించాలని కోర్టులో దావా వేశారు. రవి తన పెళ్లికి ఆహ్వానం కార్డులు పంచేందుకు తన స్నేహితుల్లో ఒకరిని సహాయం కోరాడు. అతని మిత్రుడు, చంద్రశేఖర్ రవి పెళ్లి కోసం ఎంతగానో సహాయం చేశారు. అయితే బరాత్ రోజు రవి చెప్పిన సమయం కంటే ముందుగానే వెళ్లిపోవడంతో చంద్రశేఖర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విచిత్ర సంఘటన
ఇక ఇదే విషయాన్ని పెళ్లి కొడుకుని పిలిచి సమాధానం చెప్పమని ప్రశ్నించగా, వారంతా ఆలస్యంగా వచ్చారని దయచేసి తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాలని రవి చెప్పాడు. దీంతో పెళ్లి పనుల్లో తమను అవసరం కోసం వాడుకొని, తీరా సమయానికి తమకు చెప్పకుండా బరాత్ కు వెళ్లాడని, అదేమని ప్రశ్నిస్తే తమను అవమానపరిచాడని వరుడు రవిపై నిప్పులు చెరిగిన స్నేహితులు అతనిపై పరువు నష్టం దావా వేశారు. ఇక ఈ విచిత్రమైన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.