మోడీకి నితీష్ కుమార్ బిగ్ ఝలక్..! పార్లమెంట్ లో మద్దతిచ్చి, ఇప్పుడు యూటర్న్..!
దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని దశల వారీగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రయత్నాలకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 2029 నాటికి 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతి (UCC)ని అమలు చేస్తామంటూ నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన తర్వాత కేంద్రంలో కీలక భాగస్వామి జేడీయూ (JD(U)) యూటర్న్ తీసుకుంది. గతంలో పార్లమెంట్ లో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు ఉద్దేశించిన బిల్లుకు మద్దతిచ్చిన జేడీయూ ఇప్పుడు మాత్రం బీహార్ లో అమలు చేయొద్దంటూ కేంద్రానికి తేల్చిచెప్పేసింది.
పార్లమెంటులో ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు తాము మద్దతు ఇచ్చినప్పటికీ, బీహార్లో దానిని అమలు చేయడానికి మాత్రం వ్యతిరేకమని జేడీ(యూ) సీనియర్ నేత శ్యామ్ రజక్ ఇవాళ తేల్చిచెప్పారు.తమ నాయకుడు నితీష్ కుమార్ ఈ విషయంలో పార్టీ వైఖరిని అప్పుడే స్పష్టం చేశారని ఆయన పేర్కొన్నారు. బీహార్ లో సీఎం బీజేపీకి చెందినవారే కావచ్చని, కానీ ప్రభుత్వం మిత్రపక్షాల సహకారంతో నడుస్తోందని ఆయన గుర్తుచేశారు. తమ వైఖరి స్పష్టమని, బీహార్లో యూసీసీ అమలు చేసే ప్రశ్నే తలెత్తదన్నారు. నితీష్ కుమార్ రాజకీయాల నుంచి తప్పుకోవడం, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండటంతో జేడీ(యూ) వైఖరికి పెద్దగా ప్రాముఖ్యత ఉండకపోవచ్చన్న వాదనపై ఆయన ఇలా క్లారిటీ ఇచ్చారు.

21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో 17 చోట్ల బీజేపీ సొంతంగా అధికారంలో ఉంది. మరో నాలుగు రాష్టాల్లో సంకీర్ణ ప్రభుత్వాలను మిత్రపక్షాలు నడుపుతున్నాయి. ఇందులో బీహార్ తో పాటు ఏపీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుపై ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్రంలో కీలక భాగస్వాములుగా ఉన్న నితీష్ కుమార్, చంద్రబాబును కాదని మోడీ ముందుకెళ్లే పరిస్ధితులు లేనందున, ఉమ్మడి పౌరస్మృతి విషయంలో కేంద్రం తీసుకోబోయే నిర్ణయాలు కీలకంగా మారబోతున్నాయి.















Click it and Unblock the Notifications
