మరో నాలుగు రోజుల్లో పరిష్కారం: పెట్రోల్ ధరలపై అమిత్ షా
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న ఇంధన ధరల సమస్యకు నాలుగు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ పరిష్కారం చూపుతారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా భరోసానిచ్చారు. దేశంలో ఇంధన ధరల పెంపును ప్రభుత్వం తీవ్రంగా భావిస్తోందని చెప్పారు.
ఇప్పటికే ఏర్పాటు చేసిన ఒక విధానంలో చమురు ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. వీటిని తగ్గించేందుకు ఉన్నతస్థాయిలో కసరత్తు జరుగుతోందని వివరించారు. మూడు లేదా నాలుగు రోజుల్లో ఓ పరిష్కార మార్గంతో ప్రజల ముందుకొస్తారని అన్నారు.
కాగా, బుధవారం ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చమురు సంస్థల అధికారులతో భేటీ అవుతారు. ఇప్పటికే ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా చమురు ధరల పెంపుపై ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం దీనికి పలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోందని ఆయన తెలిపారు. మంగళవారం ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.76.87ను తాకగా.. ముంబైలో రూ.84.70ను తాకింది. కాగా, పెరుగుతున్న పెట్రోల్ ధరలపై సామాన్య జనాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించి పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరుతున్నారు.