ధర్మస్థలంలో గాలి, రీ ఎంట్రీ అంటున్న అనుచరులు?
బెంగళూరు: అక్రమ మైనింగ్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మళ్లి రాజకీయాలలోకి వస్తారని ఆయన అనుచరులు, అభిమానులు అంటున్నారు. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని ఆయన ప్రజల ముందుకు వస్తారని చెబుతున్నారు.
గురువారం గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరు నుండి విమానంలో మంగళూరు చేరుకున్నారు. తరువాత మంగళూరు నుండి ధర్మస్థలం వెళ్లారు. ధర్మస్థలంలో శ్రీ మంజునాథ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ధర్మస్థలం ధర్మాధికారి డాక్టర్ డి. వీరేంద్ర హెగ్డేతో సమావేశం అయ్యారు.
గాలి జనార్దన్ రెడ్డి వెంట ఆయన భార్య లక్ష్మి, కుమారుడు కిరీటి, కుమార్తె బ్రహ్మిణి తదితరులు ఉన్నారు. ఈ సందర్బంలో గాలి సహాయకులు సంజయ్ బెటగేరి, తారనాథ్ తదితరులు ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి త్వరలో తన సన్నిహితులు, అభిమానులను కలుసుకుని రాజకీయ రంగ ప్రవేశం గురించి ఒక నిర్ణయం తీసుకుంటారని ఆయన సహాయకులు అన్నారు.
కొంత కాలం క్రితం గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, మాజీ మంత్రి, పార్లమెంట్ సభ్యడు (బీజేపీ) శ్రీరాములు ధర్మస్థలం చేరుకుని మంజునాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు గాలి కుటుంబ సభ్యులు మంజునాథ స్వామిని దర్శించుకున్నారు.
అక్రమ మైనికంగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. సుమారు 3 సంవత్సరాలకు పైగా జైలు జీవితం గడిపిన గాలి జనార్దన్ రెడ్డి 2015 జనవరిలో జైలు నుండి బెయిల్ మీద బయటకు వచ్చారు. తరువాత తిరుమల, శ్రీకాళహస్తి, శబరిమలై పుణ్యక్షేత్రాలు సందర్శించారు. రాజకీయాల గురించి గాలి ఇంత వరకు ఎక్కడ మాట్లాడలేదు.