షాకింగ్ న్యూస్- శవాల గుట్టగా గంగానది-సెకండ్ వేవ్ అనుభవాల్ని ఒప్పుకుున్న మిషన్ ఛీఫ్
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ సమయంలో భారీ ఎత్తున జనం చనిపోయారు. వీరికి ఎక్కడ అంత్యక్రియలు నిర్వహించాలో కూడా తెలియని పరిస్ధితి. అలాంటి సమయంలో ఉత్తర్ ప్రదేశ్ లో అయితే పవిత్రనదిగా చెప్పుకునే గంగానదే వారికి దిక్కయిపోయింది. దీంతో కరోనాతో చనిపోయిన వేల కొద్దీ శవాల్ని గంగలోనే పారేశారు. అప్పట్టోనే దీనిపై పెద్ద దుమారం రేగింది. అయితే దీన్ని అక్కడి యోగీ సర్కార్ ఖండించింది. కానీ ఇవాళ అదే నిజమని తేలింది.
వినాశకరమైన రెండవ కోవిడ్ వేవ్ సమయంలో గంగ "చనిపోయినవారికి సులభమైన డంపింగ్ గ్రౌండ్" గా మారిందని తాజాగా మరోసారి నిర్దారణ అయింది. అయితే ఈ వ్యవహారం యూపీకి మాత్రమే పరిమితమైందని తాజాగా వెలువడిన ఓ పుస్తకం తెలిపింది. గంగా- రీ ఇమేజింగ్, రీజువెనేటింగ్, రీకనెక్టింగ్ పేరుతో రచించిన ఈ పుస్తకాన్ని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా డైరెక్టర్ జనరల్, నమామి గంగే అధినేత రాజీవ్ రంజన్ మిశ్రా, ఈ మిషన్ లో పనిచేసిన ఐడీఏఎస్ అధికారి పుస్కల్ ఉపాధ్యాయ్ రచించారు.
మిశ్రా 1987-బ్యాచ్ తెలంగాణ-క్యాడర్ IAS అధికారి. అలాగే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాకు వివిధ హోదాల్లో ఐదేళ్లపాటు సేవలందించారు. ఈ నెల 31న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ పుస్తకాన్ని నిన్న ప్రధాని ఆర్ధిక సలహామండలి చైర్మన్ వివేక్ దేబ్రాయ్ ఆవిష్కరించారు. "ఫ్లోటింగ్ కార్ప్స్: ఎ రివర్ డిఫైల్డ్" అనే పేరుతో ఉన్న ఒక అధ్యాయనంలో ఈ పుస్తకం గంగపై మహమ్మారి ప్రభావం గురించి కీలక అంశాల్ని ప్రస్తావించింది. అలాగే నదిని రక్షించడానికి చేయడానికి ఐదు సంవత్సరాల్లో చేపట్టిన పనంతా కోవిడ్ తో నీటిపాలైందని వెల్లడించింది.
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా శవాల సంఖ్య ఎక్కువ కావడం, అవి ఉబ్బిపోవడం, జిల్లా పరిపాలనా యంత్రాంగం వాటి అంత్యక్రియల నిర్వహణ విషయంలో చేతులెత్తేశాయి. దీంతో యూపీ, బీహార్లోని శ్మశానవాటికలు, దహనం చేసే ఘాట్ల వాటి పరిమితులను దాటి పోయి గంగానది కాస్తా చనిపోయినవారికి సులభంగా డంపింగ్ చేసే ప్రదేశంగా మారిందని ఈ పుస్తకం తెలిపింది. జిల్లాల అధికారులు ఇచ్చిన డేటా ప్రకారం దాదాపు 300 శవాలు గంగానదిలో పడేశారని, కానీ ఇది అనధికారికంగా వెయ్యికి పైగా ఉంటుందని తెలిపింది.