గ్యాంగ్రేప్ బాధితురాలితో యాసిడ్ తాగించారు.. పరామర్శించిన సీఎం యోగి
యాసిడ్ దాడితో చావు బ్రతుకుల మధ్య ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న గ్యాంగ్ రేప్ బాధితురాలిని సీఎం యోగి పరామర్శించారు.
లక్నో: లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ కాలేజీ ఐసీయూలో చికిత్స పొందుతున్న గ్యాంగ్ రేప్ బాధితురాలిని(35) సీఎం యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు. తక్షణ ఆర్థిక సహాయం కింద ఆమెకు రూ.1లక్ష పరిహారాన్ని ప్రకటించారు. నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయన పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
కాగా, యూపీకి చెందిన ఓ గ్యాంగ్ రేప్ బాధితురాలు 8ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతోంది. ఇదే క్రమంలో గత గురువారం నిందితులు మరోసారి ఆమెపై దాడి చేసి బలవంతంగా యాసిడ్ తాగించారు. తన పిల్లలను కలిసేందుకు లక్నోకు 100కి.మీ దూరంలో ఉన్న ఊంచహార్ కు వెళ్తున్న సమయంలో బాధితురాలిపై ఈ దాడి జరిగింది.
యాసిడ్ దాడితో చావు బ్రతుకుల మధ్య ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసులో ఇప్పటివరకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. త్వరలోనే ఈ కేసు విచారణకు రానుండగా.. తమ కుటుంబానికి తరుచు బెదిరింపులు ఎదురువుతున్నాయని బాధితురాలి భర్త తెలిపారు. ఆసుపత్రికి సీఎం వచ్చి పరామర్శించడం సంతోషంగా ఉందని, అయితే నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, యాసిడ్ దాడి బాధితులకు ఉద్యోగాలు కల్పించే కేఫ్ లో బాధితురాలు పనిచేస్తోంది. తాము పేదవారిమని, కానీ భార్య మీదున్న నమ్మకంతోనే ఈ కేసులో ఇంకా పోరాడుతున్నానని బాధితురాలి భర్త అన్నారు.