తొలి త్రైమాసికంలో ఊహించని జీడీపీ వృద్ధి రేటు: 8.2శాతంగా నమోదు
న్యూఢిల్లీ: దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటు ఊహించని రీతిలో దూసుకెళ్లింది. జీడీపీ వృద్ధి రేటు 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 8.2 శాతంగా నమోదైంది. స్థూల విలువ ఆధారిత (జీవీఏ) వృద్ధి రేటు 8 శాతంగా నమోదైంది.
రాయిటర్స్ నిర్వహించిన పోల్లో ఆర్థికవేత్తలు భారతదేశ జీడీపీ 7.6 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. తాజాగా, ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ అంచనాలు మించి అభివృద్ధి జరిగింది. ఇది రెండేళ్ళలో అత్యధిక వృద్ధి కావడం గమనార్హం.
మాన్యుఫ్యాక్చర్, కన్జ్యూమర్ స్పెండింగ్ రంగాలు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాయి. ఈ కారణంగానే జీడీపీ అంచనాలను దాటేస్తూ ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ త్రైమాసికంలో మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, ఇంధన రంగాల్లో 7 జీతం పెరిగినట్లు సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వెల్లడించింది.
అంతకుముందు త్రైమాసికంలో జీడీపీ 7.7 శాతం నమోదైన సంగతి తెలిసిందే. 2017-18 ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు కేవలం 5.59 శాతం మాత్రమే నమోదైంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధికి కారణం తయారీ రంగం 13.5 శాతం నమోదు కావొచ్చని చెప్పవచ్చు.
మరోవైపు స్టాట్ మార్కెట్లు మాత్రం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు నష్టపోయింది. 38 వేల 645 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసింది. కాగా, జీడీపీ దూసుకెళ్లడం మోడీ ప్రభుత్వానికి ఓ శుభ సంకేతంగా మారింది.