కొత్త ఆర్మీ చీఫ్గా నరవణే.. రేపే బాధ్యతల స్వీకారం.. సీడీసీగా బిపిన్ రావత్
ఇండియన్ ఆర్మీకి 28వ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా లెఫ్టెనెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగిన జనరల్ బిపిన్ రావత్ మంగళవారమే పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్గా ఉన్న నరవణే ను చీఫ్ గా ఎంపికచేస్తూ కొద్దిరోజుల కిందటే కేంద్రం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే.
విశేష అనుభవం..
ఆర్మీ డిప్యూటీ చీఫ్ గా ఢిల్లీకి రాకముందు మనోజ్ నరవణే దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుదీర్ఘకాలం పాటు సేవలందించారు. చైనా బోర్డర్ ను రక్షించే ఈస్టెర్న్ కమాండ్ అధిపతిగానే కాకుండా శ్రీలంకలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్లో, మయన్మార్లోని భారత రాయబార కార్యాలయంలోనూ నరవణే డ్యూటీ చేశారు. వాటితోపాటు కోల్కతాలో ఈస్ట్రన్ కమాండ్ చీఫ్గా, కల్లోల కాశ్మీర్ తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ల అధిపతిగా విశేష అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. అసోం రైఫిల్స్ ఇన్స్పెక్టర్ జనరల్గా, జమ్మూకశ్మీర్లో రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్కు కమాండెంట్గానూ ఆయన పనిచేశారు.
ఎన్నో మెడల్స్..
1980 జూన్ లో తొలిసారి ఆర్మీలోకి ప్రవేశించిన ఆయన.. సిక్కు లైట్ ఇన్ఫ్యాంట్రీ రెజిమెంట్ 7వ బెటాలియన్లో డ్యూటీలో చేరారు. సుదీర్ఘకాలంపాటు వివిధ హోదాల్లో ఆర్మీకి సేవలందిచిన ఆయనకు ఎన్నో పురస్కారాలు దక్కాయి. వాటిలో విశిష్ట్ సేవా మెడల్, అతి విశిష్ట్ సేవా మెడల్ కూడా ఉన్నాయి. కొత్త ఆర్మీ చీఫ్ భార్య వీణా నరవణే టీచర్గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మహాదళపతి రావత్
కేంద్రం కొత్తగా క్రియేట్ చేసిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పోస్టును జనరల్ బిపిన్ రావత్ చేపట్టనున్నారు. మంగళవారం ఆర్మీ చీఫ్ గా రిటైరైన వెంటనే కొత్త బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య సంయమనం కోసమే సీడీఎస్ ను నియమించనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.