షాక్: పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చి.. ఆ మహిళను కౌగిలించుకోమన్నపోలీసు!
లక్నో: పాస్ పోర్టు వెరిఫికేషన్ కోసం వచ్చిన ఓ పోలీసు అధికారి.. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. తనను కౌగిలించుకోమంటూ ఒత్తిడి చేశాడు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం సోషల్ మీడియా ద్వారా కేంద్రమంత్రులకు పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.
బాధిత మహిళ ఓ ప్రముఖ వార్తా సంస్థలో జర్నలిస్టుగా పనిచేస్తుండటం గమనార్హం. ఆమె ఈ ఘటనపై కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, ఘజియాబాద్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వరుస ట్వీట్లు పెట్టి ఆమె ఈ ఘటనకు సంబంధించిన వేదనను తెలియజేశారు.
'పాస్పోర్ట్ వెరిఫికేషన్ సమయంలో దరఖాస్తుదారులు, ముఖ్యంగా మహిళలకు భద్రత అనేది లేకుండా పోయింది. నా పాస్పోర్ట్ రెన్యువల్లో భాగంగా వెరిఫికేషన్ కోసం కొద్ది నిమిషాల క్రితం ఓ పోలీసు ఘజియాబాద్లోని మా ఇంటికి వచ్చాడు. అప్పుడు నాకు అత్యంత భయానక అనుభవం ఎదురైంది' అని పేర్కొన్నారు.
'ఆ పోలీసు కావాలనే నా పాస్పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను జాప్యం చేస్తూ వచ్చాడు. అలా అవకాశం కోసం ఎదురుచూశాడు. ఆ తర్వాత 'నీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ పూర్తి చేశాను. ఇప్పుడు నువ్వు నాకేం ఇస్తావ్' అని అంటూ కౌగిలింత కావాలని అడిగాడు. ఆ పోలీస్ పేరు దేవేంద్ర సింగ్' అని సదరు మహిళా జర్నలిస్టు తెలిపారు. కాగా, మహిళలను ఆపదలను నుంచి రక్షించాల్సిన బాధ్యతాయుతమైన శాఖలో పనిచేస్తూ ఇలాంటి వేధింపులకు పాల్పడిన సదరు పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు జర్నలిస్టులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.