పారిన మల్లికార్జున ఖర్గె పాచిక- సొంత గూటికి గులాం నబీ ఆజాద్..!!
న్యూఢిల్లీ: కర్ణాటకకు చెందిన సీనియర్ నేత మల్లికార్జున ఖర్గె.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత పలు కీలక మార్పులు చోటు చేసుకుంటోన్నాయి. వ్యవస్థాపరమైన లోపాలను సరిదిద్దడంపై ఆయన దృష్టి సారించారు. పార్టీకి మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకుని వచ్చే దిశగా వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకుంటోన్నారు. ఏఐసీసీ చీఫ్ గా ఖర్గె పగ్గాలను అందుకున్న తరువాత హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.
భారత్ జోడో యాత్ర సక్సెస్..
ఏఐసీసీ మాజీ అధినేత, వాయనాడ్ లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సక్సెస్ కావడంలోనూ ఖర్గె పాత్ర ఉందనే అభిప్రాయాలు లేకపోలేదు. కాంగ్రెస్ పెద్దగా బలంగా లేని దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా జోడో యాత్రకు భారీగా ప్రజల మద్దతు లభించడానికి ఖర్గే చేసిన సూచనలు ఫలించాయనే అంచనాలు ఉన్నాయి.
సొంతగూటికి ఆజాద్..
ఇక ఖర్గే- పార్టీ నుంచి వెళ్లిపోయిన సీనియర్లపై దృష్టి పెట్టారు. వారిని మళ్లీ సొంతగూటికి రప్పించే ప్రయత్నాలు చేస్తోన్నారు. ఇక్కడ కూడా ఆయన విజయం సాధించినట్టే కనిపిస్తోంది. రాహుల్ గాంధీపై ఘాటు విమర్శలు సంధిస్తూ- అయిదు పేజీల బహిరంగ లేఖను రాసి మరీ గుడ్ బై చెప్పిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్- మళ్లీ సొంతగూటికి చేరుకోనున్నారు. ఈ దిశగా ఖర్గే వేసిన స్కెచ్ మళ్లీ సత్ఫలితాలను ఇచ్చింది.
జీ-23
కాంగ్రెస్ లో అసమ్మతి వాదులుగా ముద్రపడిన జీ-23 నాయకులను బుజ్జగించడంలో ఖర్గె సక్సెస్ అయ్యారు. వారికి కీలక బాధ్యతలను అప్పగించారు. ఇది అసమ్మతని చల్లార్చినట్లుగా చెబుతున్నారు. జీ-23 నాయకులు అఖిలేష్ ప్రసాద్ సింగ్ను బిహార్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అపాయింట్ చేశారు. భూపీందర్ సింగ్ హుడాకు హర్యానా కాంగ్రెస్ బాధ్యతలను అప్పగించారు. ఈ పరిణామాలు జీ 23 నేతల్లో ఉన్న అసమ్మతి గళం తీవ్రతను తగ్గించినట్టయింది.
ఆజాద్ తో చర్చలు..
గులాం నబీ ఆజాద్ ను మళ్లీ పార్టీలోకి చేర్చుకోవడానికి ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు ఖర్గె. ఈ టీమ్లో అఖిలేష్ ప్రసాద్ సింగ్, భూపీందర్ సింగ్ హుడాతో పాటు పార్టీ సీనియర్ నాయకురాలు, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థిగా పోటీ చేసిన అంబికా సోనీ ఉన్నారు. ఈ ముగ్గురు, కొందరు సీనియర్ నేతలు.. గులాం నబీ ఆజాద్తో సంప్రదింపులు కూడా మొదలు పెట్టారు అవి సానుకూల వాతావరణంలో ముగిశాయి. త్వరలోనే ఆజాద్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో రీ ఎంట్రీ ఇస్తారని ఏఐసీసీ వర్గాలు స్పష్టం చేశాయి.
జోడో యాత్ర ముగింపు సభలో..
ఈ నేపథ్యంలో- త్వరలోనే గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీని కలుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ యాత్ర జమ్మూ కాశ్మీర్ లో అడుగు పెట్టిన రోజే ఆయన రాహుల్ ను కలిసి పార్టీ కండువాను కప్పుకొనే అవకాశం ఉందని అంటున్నారు. లేదా- ముగింపు సభలో పాల్గొనడం ఖాయమనీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకుని రావడానిక తనవంతు కృషి చేస్తానంటూ గులాం నబీ ఆజాద్ హామీ సైతం ఇచ్చారని తెలుస్తోంది.
సొంత కుంపటి..
ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీన గులాం నబీ ఆజాద్.. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. పార్టీతో ఉన్న 52 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్నారు. అక్టోబర్లో డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ పేరుతో సొంత కుంపటిని పెట్టుకున్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి తారాచంద్తో సహా పలువురు నేతలు ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ వారందరూ సొంత గూటికి చేరుకుంటారని ఏఐసీసీ స్పష్టం చేస్తోంది.