బాలికలపై లైంగిక దాడులు.. తెలంగాణ సర్కార్ కఠిన చర్యలు.. పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీ
ఢిల్లీ : బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్న ఘటనలు నిత్యం ఏదో ఒక చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆ క్రమంలో తెలంగాణ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుందని పార్లమెంట్ వేదికగా ప్రకటించారు టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేయబోదని.. నిందితులకు సరైన శిక్ష పడేలా చేస్తుందని వివరించారు.
లోక్సభ సమావేశాల్లో భాగంగా బాలికల లైంగిక వేధింపుల రక్షణ బిల్లుపై కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం బాలికల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆ క్రమంలో స్పెషల్ ప్రొటెక్షన్ స్కీమ్స్ అమలు చేస్తోందని సభ దృష్టికి తీసుకొచ్చారు. మహిళలు, బాలికలు లైంగిక వేధింపులకు గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చొరవతో షీ టీమ్స్ ఏర్పాటయ్యాయని వెల్లడించారు.
హాజీపూర్ సైకో శీను కేసులో ఛార్జ్ షీట్.. ఉరిశిక్ష పడేనా?
షీ టీమ్స్ నిరంతరాయంగా పనిచేస్తుండటంతో తెలంగాణలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు తగ్గినట్లు చెప్పుకొచ్చారు ప్రభాకర్ రెడ్డి. అంతేకాదు మహిళల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక కోర్టులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు. బాలికలపై లైంగిక దాడులకు పాల్పడే నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఆ క్రమంలో బాలికల లైంగిక వేధింపుల రక్షణ బిల్లుకు టీఆర్ఎస్ పార్టీ తరపున మద్దతు ప్రకటించారు.