GOA elections: గోవాలో మహిళలకు వరాలజల్లు: పోటీపడుతున్న రాజకీయ పార్టీలు; మ్యాటర్ ఇదే!!
2022 అసెంబ్లీ ఎన్నికలకు గోవా సన్నద్ధమవుతున్న తరుణంలో, రాష్ట్రంలోని మహిళా ఓటర్ల పై అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. గోవాలో మహిళా ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గోవా అసెంబ్లీ ఎన్నికలలో పోటీలో ఉన్న మూడు పార్టీలు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పటికే మహిళలకు అనేక వరాల జల్లులు కురిపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మహిళల కోసం అనేక పథకాలను అందిస్తామని వెల్లడిస్తున్నారు.

గోవాలో మహిళలకు ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్
డిసెంబరు 10న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఇటీవల గోవాలో పర్యటించినప్పుడు, గోవాలో మహిళలకు ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒకరోజు పర్యటనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని మహిళలతో సమావేశాలలో పాల్గొన్నారు. కోస్తా గ్రౌండ్లో జరిగిన మహిళా సదస్సులో ఆమె మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, రాష్ట్రంలోని గిరిజన మహిళలతో సంభాషించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని, గోవాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలలో 30శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

గృహలక్ష్మి పథకం ప్రకటించిన టీఎంసీ.. నెలకు 5 వేల రూపాయల ఆర్ధిక భరోసా
కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసిన తర్వాత, తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సైతం వరాల జల్లు కురిపించారు. గోవాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గృహ లక్ష్మి పథకాన్ని అందిస్తామని మమతా బెనర్జీ వెల్లడించారు. గృహ లక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు ఐదు వేల రూపాయల ఆర్థిక భరోసా కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తద్వారా మహిళలు ఆర్ధిక స్వావలంబన సాధించవచ్చని ఆమె పేర్కొన్నారు.

నెలకు మహిళలకు వెయ్యి రూపాయలు ఇస్తామన్న ఆమ్ ఆద్మీ
గతంలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇదే ఈ విధమైన ఆఫర్ గోవా మహిళలకు ఇచ్చింది. రాష్ట్రంలోని వయోజన మహిళలందరికీ నెలకు రూ.1,000 ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. గోవాలో మహిళలపై ప్రధాన పార్టీలు ఇంతగా ఫోకస్ చేయడం వెనుక కారణాలు లేకపోలేదు. గోవాలో మహిళ ఓటర్లపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేయడానికి ప్రధాన కారణం గోవాలో పురుషుల కంటే మహిళల ఓటర్లు అధికంగా ఉండటం అని తెలుస్తుంది.

గోవాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం.. ఫోకస్ వెనుక కారణమిదే
భారతదేశంలోని 13 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో గోవా ఒకటి, ఇక్కడ పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. 2019 నాటికి, గోవాలో 4.4 లక్షల మంది మహిళా ఓటర్లు ఉండగా, రాష్ట్రంలో 4.1 లక్షల మంది పురుషులు ఉన్నారు. మహిళా ఓటర్ల ప్రాముఖ్యతను రాజకీయ పార్టీలు ఎక్కువగా గుర్తిస్తున్నాయి. గోవాలో వచ్చే ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్న పలు పార్టీలు మహిళలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని, ఓటర్లను ఆకట్టుకునే మహిళలకు అవకాశం ఇవ్వాలని కూడా భావిస్తున్నాయి.
Recommended Video

మహిళలను ఆకట్టుకునే పనిలో రాజకీయ పార్టీలు.. అందుకే వరాల జల్లు
ఇంతకుముందు, ఎన్నికలలో పురుషులతో పోలిస్తే మహిళల పోలింగ్ తక్కువగా ఉండేది కానీ మారుతున్న కాలంతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో చదువుకోవడం , సోషల్ మీడియా వ్యాప్తి, మహిళలు తమ స్వంత ఓటింగ్ నిర్ణయాలను తీసుకోవడం వంటి కారణాలతో ఇటీవలకాలంలో గోవాలో మహిళల పోలింగ్ ఎక్కువగా నమోదు అవుతుంది. పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న కారణంగా గోవాలో ప్రధాన పార్టీలన్నీ మహిళా ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇప్పటికే గోవాలో మహిళలకు వరాల జల్లు కురిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications