'వీర్సావర్కర్.. ఎంత వీరుడు..?' : కాంగ్రెస్ పుస్తకం.. నిషేధించాలని హిందూ సంఘాల డిమాండ్
హిందూ మహాసభ వ్యవస్థాపకుడు వినాయక్ దామోదర్ సావర్కర్పై కాంగ్రెస్ ప్రచురించిన ఓ పుస్తకం వివాదాస్పదమవుతోంది. 'వీర్ సావర్కర్,ఎంత వీరుడు?' అనే టైటిల్తో ప్రచురించిన ఆ పుస్తకాన్ని నిషేధించాల్సిందిగా గోవా హిందూ జనజాగృతి సమితి(HJS) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పుస్తకంలో వీర్ సావర్కర్ను కించపరిచే అంశాలున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
ఈ నెల 2వ తేదీన మధ్యప్రదేశ్లోని భోపాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఈ పుస్తకాన్ని చాలామందికి పంపిణీ చేశారు. ఏ అర్హతలతో వీర్ సావర్కర్ను దేశ భక్తుడు అంటున్నారని అందులో ప్రశ్నించారు. ఇదే పుస్తకంలో మహాత్మా గాంధీని హత్య చేసిన నాథురాం గాడ్సేపై కూడా కొన్ని వక్రీకరణలు చేశారని హిందూ జనజాగృతి సమితి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

కేంద్రప్రభుత్వం తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని గోవా హిందూ జనజాగృతి సమితి కన్వీనర్ మనోజ్ సోలంకి డిమాండ్ చేశారు. దీనిపై గోవాలోని సౌత్ కలెక్టర్ సురేంద్ర నాయక్కు వినతిపత్రం కూడా అందజేశారు. సావర్కర్ పైనే కాదు,భవిష్యత్లో మరే స్వాతంత్య్ర సమరయోధుడు లేదా దేశం గౌరవించే నేతలను కించపరచకుండా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పంపిణీ చేసిన ఆ పుస్తకం వెనుక రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు. దేశంలో మత,కుల పరమైన విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఆ పుస్తకాన్ని ప్రచురించారని ఆరోపించారు. వీర్ సావర్కర్పై దిగజారుడు రాతలు రాసిన ఆ పుస్తకాన్ని తక్షణం నిషేధించాలని డిమాండ్ చేశారు.ఆ పుస్తకాన్ని ప్రచురించిన పబ్లిషర్పై కూడా చర్యలు తీసుకోవాలన్నారు.
కాగా,ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సావర్కర్పై చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పు పట్టిన సంగతి తెలిసిందే. దేశం ప్రపంచానికి అత్యాచారాల రాజధానిగా మారిపోయిందంటూ ఆయన చేసిన
వ్యాఖ్యలపై బీజేపీ క్షమాపణలు డిమాండ్ చేసింది. అయితే క్షమాపణలు చెప్పేందుకు తానేమీ రాహుల్ సావర్కర్ను కాదని, రాహుల్ గాంధీని అని స్పష్టం చేశారు. సావర్కర్ అండమాన్ జైల్లో ఉన్న సమయంలో ఆంగ్లేయులకు క్షమాపణ లేఖలు రాశారన్న ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్ ఆ వ్యాఖ్యలు చేయగా బీజేపీ దాన్ని తీవ్రంగా ఖండించింది.












Click it and Unblock the Notifications