విభజన: హైదరాబాద్పై మధ్యేమార్గం, అస్పష్టమే
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే సీమాంధ్ర నేతల డిమాండుకు, పూర్తిగా హైదరాబాద్పై తెలంగాణ రాష్ట్రానికి అధికారం కట్టబెట్టాలనే తెలంగాణ నాయకుల వాదనలను పక్కన పెట్టి మధ్యేమార్గం అవలంబించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ దిశలో కేంద్ర మంత్రుల బృందం (జివోఎం) హైదరాబాద్పై కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధిని రెండు రాష్ట్రాలకు పదేళ్ళపాటు ఉమ్మడి రాజధాని చేయాలని జీవోఎం నిర్ణయించింది. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ను నియమించాలని, నాలుగు అంశాలు భూపరిపాలన, శాంతిభద్రతలు, ఉన్నత విద్య, మున్సిపల్ వ్యవహారాలను గవర్నర్ చేతిలో ఉంచేలా జీవోఎం నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఈనెల 21న మంత్రివర్గ సమావేశం జరగనుంది. జీవోఎం తీసునున్న నిర్ణయాలను కేబినెట్ భేటీ ముందు ఉంచనుంది. అయితే, ఈ నెల 21వ తేదీన జివోఎం నివేదిక వస్తుందా, లేదా అనేది ఇంకా అనుమానంగానే ఉంది. 21వ తేదీ తర్వాత అత్యవసరంగా మంత్రివర్గం తెలంగాణపై సమావేశం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. తెలంగాణ అంశాన్ని శుక్రవారం కూడా జీవోఎం సమావేశమై ఈ మేరకు ఆలోచన చేసినట్లు తెలియవచ్చింది.
ఆంటోని కమిటి, టాస్క్ ఫోర్స్ నివేదిక, జీవోఎం - ఈ మూడు కమిటీల ఆలోచనలు ఒకే విధంగా ఉన్నట్లు సమాచారం. సీమాంధ్రుల రక్షణ కొరకు బిల్లులోనే రూపొందించాలని టాస్క్ ఫోర్స్ చీఫ్ విజయకుమార్ తన నివేదికలో చెప్పినట్లు తెలుస్తోంది. హైదరాబాదు స్థితిపై నిర్ణయానికి వచ్చినప్పటికి మరో కీలకమైన విషయంపై ఇంకా అస్పష్టత కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
దానిపై జివోఎం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఆదాయం రెండు రాష్ట్రాలకు ఎలా పంచాలనే విషయంపై చర్చలు జరుపుతోంది. ఒకటి, రెండు రోజుల్లో ఆ విషయంపై కూడా స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఈ నెల 18వ తేదీన జీవోఎం రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశం కానుంది. ఈ నెలాఖరులోగా తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర శాసనసభకు వచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.