ఘోర రైలు ప్రమాదం: ఎక్స్ప్రెస్ను ఢీ కొట్టిన గూడ్స్: కోరమాండల్ తరహాలో..
Kanchenjunga Express: పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కాంచన్జంగ ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. పలు బోగీలు నుజ్జు నుజ్జు అయ్యాయి. చెల్లా చెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఇప్పటివరకు ఎంతమంది మరణించారనేది ఇంకా తెలియరాలేదు.
సమాచారం అందుకున్న వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బలగాలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు, రైల్వే శాఖ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. బోగీల్లో చిక్కుకున్న వారిని వెలికి తీస్తోన్నారు. క్షతగాత్రుల హాహాకారాలు, చెల్లా చెదురుగా పడ్డ బోగీలతో సంఘటన స్థలం భీతావహంగా మారింది.

ఈ దుర్ఘటన ఒడిశాలో సంభవించిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఉదంతాన్ని గుర్తుకు తెస్తోంది. గత ఏడాది ఇదే జూన్ నెలలో 2వ తేదీన ఒడిశాలోని బాలాసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 296 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. సుమారు వెయ్యిమంది వరకు గాయపడ్డారు.
ఇప్పుడు మళ్లీ అదే జూన్ నెలలో అదే తరహాలో రైలు ప్రమాదం సంభవించడం చర్చనీయాంశమౌతోంది. డార్జిలింగ్ జిల్లా సిలిగురి డివిజన్ పరిధిలోని రైధాసా- రంగపణి స్టేషన్ల మధ్య ఫన్సీ దేవా వద్ద ఈ ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్లోని సియాల్దా నుంచి అస్సాంలోని సిల్చార్కు బయలుదేరిన ఈ రైలు మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది.

ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి మమత బెనర్జీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రాణాపాయాన్ని నివారించడానికి అన్ని వనరులను వినియోగిస్తోన్నట్లు తెలిపారు. డాక్టర్లు, నర్సలు, ఇతర పారా మెడికల్ సిబ్బంది, మందులను సంఘటన స్థలానికి తరలించినట్లు వెల్లడించారు. అంబులెన్సులను అందుబాటులో ఉంచామని చెప్పారు.
#WATCH | West Bengal | Wagon of Kanchenjunga Express train suspended in the air after a goods train rammed into it at Ruidhasa near Rangapani station under Siliguri subdivision in Darjeeling district today; rescue operation underway pic.twitter.com/rYnEfC3vic
— ANI (@ANI) June 17, 2024
సహాయక చర్యలను పర్యవేక్షించడానికి కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లను మోహరింపజేశారు. గాయపడ్డ వారికి ఎలాంటి వైద్య సహాయాన్నయినా ఉచితంగా అందిస్తామని మమతా బెనర్జీ అన్నారు. సమీప ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు అందుబాటులో డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందిని ఉంచామని చెప్పారు.












Click it and Unblock the Notifications