పట్టపగలే దారుణం: యువతి దుస్తులిప్పేసే యత్నం
ఆమెపై జరుగుతున్న ఈ దారుణాన్ని అటువైపుగా వస్తున్న ఓ బాటసారి, పోలీసు కలిసి అడ్డుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుల్లో ఒకర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే బాధిత యువతి ఫిర్యాదు ఇచ్చేందుకు సుముఖత చూపలేదు. ఆ తర్వాత యువతి, ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో నిందితులైన మరో ఇద్దరు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా స్పందిస్తూ... మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను తీవ్రంగా పరిగణిస్తామని, ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.
కండివిలిలోని హిందూస్థాన్ నాకా ఆమన్ వెల్ఫేర్ సొసైటీ వద్ద సాయంత్రం 4.30 గంటలకు చోటు చేసుకున్నట్లు తెలిపారు. మలాద్లో నివాసం ఉండే బాధిత యువతి తన స్నేహితురాలితో కలిసి బాంద్రా నుంచి హిందూస్థాన్ నాకాకు ఆటోలో వచ్చారు. ఆటో వాలాకు చెల్లించేంత డబ్బు లేకపోవడంతో బాధిత యువతి స్నేహితురాలు, తన బంధువుల వద్ద డబ్బులు తీసుకువస్తానని వెళ్లింది. తన స్నేహితురాలు తిరిగి రాకపోవడంతో ఆటో డ్రైవర్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆమె దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ను తీసుకోమ్మని, డబ్బులు ఇచ్చాక తిరిగి తీసుకుంటానని చెప్పింది.
ఈ సమయంలోనే బాధిత యువతి వద్దకు వచ్చిన యువకులు వేధించడం మొదలుపెట్టారు. దీంతో యువతి అక్కడ్నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. అయితే ఆ యువకులు ఆమెను వెంబడించారు. యువతిని పట్టుకున్న యువకులు ఆమె దస్తులు విప్పేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె దగ్గరలోని రెస్టారెంటులోకి వెళ్లింది. రెస్టారెంటు యాజమాన్యం ఆమెకు సహాయం చేయాల్సింది పోయి బయటికి తోసేశారు. మరో ఆటోలో ఎక్కేందుకు ప్రయత్నించిన ఆమెకు అదే అనుభవం ఎదురైంది.
యువతి అరుపులు విన్న అటుగా వెళుతున్న ఓ వ్యక్తి నిందితులలో ఒకడ్ని పట్టుకున్నాడు. దీంతో మిగితా నిందితులు అకడ్నుంచి పారిపోయారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన పోలీసు అధికారికి అతన్ని అప్పగించాడు. నిందితులు ఫయాజ్ అహ్మద్ ఖాన్ (20), సరోజ్ ఖాన్ (20), నౌషద్ ఖాన్ (24)లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై ఐపిసి 354 (వేధింపులు) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగితా నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.