ప్రభుత్వ జాబ్స్కు డిమాండ్: ప్రైవేట్ ఉద్యోగాలకు తగ్గిన క్రేజ్, ఎందుకంటే?
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు తగ్గడం, ఉద్యోగ భద్రతపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రోఫెషనల్స్ సైతం పోటీ పడుతున్నారని రిక్రూట్మెంట్ సంస్థ క్వార్ట్జ్ నివేదిక ప్రకటించింది.
ప్రైవేట్ రంగం కంటే ప్రభుత్వం రంగంలోని ఉద్యోగాలకు పెద్ద ఎత్తున డిమాండ్ నెలకొంది. ప్రభుత్వ కొలువులకు ఎప్పుడూ లేనంతగా డిమాండ్ వస్తోంది. గతంలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉండేవి.
కానీ, అందుకు భిన్నంగా ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే దీనికి ఇటీవల కాలంలో చోటు చేసుకొన్న పరిణామాలే కారణంగా చెబుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్
2016లో నోట్ల రద్దుతో పాటు గత ఏడాది జులైలో జీఎస్టీ ప్రవేశపెట్టడంతో ఈ రెండేళ్లలో వ్యాపారాలు దెబ్బతిని ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనంతో ప్రైవేట్ ఉద్యోగాలు తగ్గుముఖం పట్టాయి. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగాల్లో ఒకటైన ఐటీ సేవల పరిశ్రమ సైతం ఈ రెండేళ్లలో భారీ కుదుపులకు లోనైంది. దీంతో ప్రైవేట్ ఉద్యోగాల కంటే ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది.
ప్రభుత్వ ఉద్యోగాలకు ఎందుకు మొగ్గుచూపుతున్నారు
ప్రైవేట్ రంగంలో అభద్రత నెలకొన్న క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలే సుస్థిరమైనవన్న ఆలోచన యువతలో కలుగుతుందని రిక్రూట్మెంట్ సంస్థ హెడ్హంటర్స్ వ్యవస్థాపకులు క్రిష్ లక్ష్మీకాంత్ అన్నారు. రైల్వేలు లేదా ఇతర ప్రభుత్వ సంస్థల్లో ప్యూన్ ఉద్యోగానికి సైతం నెలకు రూ 25,000 వేతనం లభిస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్కు సైతం అతను టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి పెద్ద కంపెనీల్లో చేరితే మినహా ఇంత వేతనం లభించడం లేదని చెప్పారు. .ప్రైవేట్ రంగంలో ఇంక్రిమెంట్లు అధికంగా ఉన్నా ప్రభుత్వ ఉద్యోగాలకు లేఆఫ్ల బెడద లేదని ఆయన చెప్పారు.
ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల పెద్ద ఎత్తున నియామకాలకు దిగడంతో పలు పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో రైల్వేలు 90,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అయితే దీనికి సుమారు 2.3 కోట్ల దరఖాస్తులు వచ్చాయి.. టెక్నీషియన్లు, లోకోమోటివ్ డ్రైవర్ల వంటి పోస్టులకు 5 లక్షల మంది పైగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. రైల్వేల్లో క్లర్కులు, స్టేషన్ మాస్టర్, టీసీ, కమర్షియల్ అప్రెంటీస్, ట్రాక్మెన్, హెల్పర్, గన్మెన్, ప్యూన్ వంటి పోస్టులకు ప్రకటన వెలువడింది.
క్లరికల్ పోస్టులకు భారీగా దరఖాస్తులు
క్లరికల్ పోస్టులకు కూడ భారీగా ధరఖాస్తులు వస్తున్నాయి. తమిళనాడులో క్లరికల్ ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. క్లరికల్ పోస్టులకు 992 మంది పీహెచ్డీ అభ్యర్థులు, 23,000 మంది ఎంఫిల్ విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకొన్నారు. , 2.5 లక్షల మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 8 లక్షల మంది గ్రాడ్యుయేట్లు పోటీపడ్డారు. కాగా మహారాష్ట్రలో ఈ నెల వెలువడిన పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు డాక్టర్లు, ఎంబీఏలు, న్యాయవాదుల నుంచి దరఖాస్తులొచ్చాయి. ఇక ఈ ఏడాది జనవరిలో మధ్యప్రదేశ్లో ప్యూన్ పోస్టుల నియామకానికి జారీ చేసిన నోటిఫికేషన్లో అత్యధిక విద్యార్హతలు కలిగిన వారు పెద్దసంఖ్యలో పోటీపడ్డారు.