పార్లమెంట్కు 'ట్రాన్స్జండర్ల' బిల్లు: సదుపాయాలివే
న్యూఢిల్లీ: భారత్లో లింగ మార్పిడి చేయించుకున్న వారి హక్కులను కాపాడే నిమిత్తం రూపొందించిన 'ట్రాన్స్ జండర్ పర్సన్స్ బిల్' తొలిసారిగా పార్లమెంట్ ముందుకు రానుంది. ఈ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది.
లింగమార్పిడి చేయించుకున్న వారితో పాటు, హిజ్రాలను అధికారికంగా గుర్తించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. అంతేకాదు ట్రాన్స్ జండర్లకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వడమే లక్ష్యంగా ఈ బిల్లును ఎన్డీఏ సర్కారు రూపొందించింది.
ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే, ట్రాన్స్ జండర్లు వెనుకబడిన తరగతుల వర్గాల్లోకి చేరుతారు. అంతేకాదు థర్డ్ జెండర్ పేరిట వీరికి ప్రత్యేకంగా గుర్తింపు కార్డులను కూడా జారీ చేయనున్నారు. ఓబీసీ కోటా ప్రకారం వీరికి అన్ని రిజర్వేషన్లూ వర్తిస్తాయి.
దీనికి సంబంధించిన బిల్లును సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 'ట్రాన్స్ జండర్ పర్సన్స్ బిల్'ను ఈ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీ ట్రాన్స్ జండర్ల సంఖ్యను లెక్కించారు.
ఈ ఐదుగురు సభ్యుల కమిటీలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ కూడా ఉన్నారు. లింగమార్పిడి చేయించుకున్న వారికి సమాజంలో గౌరవం లభించడం లేదన్న నేపథ్యంలో వారిని కూడా ప్రభుత్వ పథకాల్లో భాగం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 6 లక్షల మంది వరకూ ట్రాన్స్ జండర్లు ఉన్నారు.