క్లిష్టమే, నొప్పించకుండా: బ్లాక్మనీపై అమిత్ షా ఇలా, స్వామి అలా
న్యూఢిల్లీ: నల్లధనం వెనక్కి తీసుకు వచ్చే విషయమై భారతీయ జనతా పార్టీ ముఖ్యనేతలు భిన్నంగా స్పందించారు! ఆ పార్టీ అధ్యక్షులు అమిత్ షా, సీనియర్ నేత సుబ్రహ్మమ్య స్వామి నల్లధనం తీసుకు వచ్చే విషయమై శనివారం మాట్లాడారు.
నల్లధనం వెనక్కి తేవడం క్లిష్టమైన ప్రక్రియ అని, ప్రభుత్వం నానా కష్టాలు పడి 700 మంది నల్లధన కుబేరుల పేర్లను ప్రత్యేక దర్యాఫ్తు (సిట్) బృందానికి అప్పగించిందని అమిత్ షా ఢిల్లీ బహిరంగ సభలో అన్నారు. నల్లధనం విషయం ఒక్క భారత్ చేతిలో మాత్రమే లేదని, ఆ క్రమంలో చాలా దేశాలతో చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాలు అడ్డుతగులుతున్నాయన్నారు.

అంతర్జాతీయ ఒప్పందాల పైన అవగాహన రాగానే.. నల్లధనం నిందితులను కచ్చితంగా శిక్షిస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నల్ల ధనం పైన ప్రపంచ దేశాలలో ఓ వాతావరణాన్ని నెలకొల్పారని, దానిపై చర్యలు తీసుకునేందుకు అనేక దేశాల మధ్య ఏకాభిప్రాయం తీసుకు వచ్చారన్నారు.
సుబ్రహ్మణ్య స్వామి కోల్కతాలో మాట్లాడుతూ.. నల్లధనాన్ని వెనక్కి తెస్తామని, తెచ్చి తీరుతామన్నారు. విదేశీ బ్యాంకుల్లో కుప్పలు కుప్పలుగా మూలుగుతున్న 120 లక్షల కోట్లను భారత్ రప్పిస్తామని, జూన్ 1 తర్వాత దీనిపై ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.
నల్ల కుబేరుల జాబితాలో ప్రముఖుల పేర్లు ఉన్నాయని, ఈ క్రమంలో వారిని నొప్పించినట్లవుతుందని, ఎవరినీ నొప్పించకుండా డబ్బును వెనక్కి తీసుకు రావాలంటే నిదానమే ప్రధానమన్నారు. నల్లడబ్బును వెనక్కి తీసుకు రావాలంటే ఒకే ఒక్క మార్గం బిల్లు పెట్టడం లేదా ఆర్డినెన్స్ తేవడం అన్నారు.












Click it and Unblock the Notifications