ఆప్షన్ లేదు..పళనిస్వామికే ప్రభుత్వ పగ్గాలు అప్పజెప్పండి: సుబ్రహ్మణ్యస్వామి
రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు వేరే ఆప్షన్ ఏమి లేదని, పళనిస్వామితో ప్రమాణస్వీకారం చేయించాలని సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ చేశారు.
చెన్నై: సుప్రీం తీర్పుతో మొత్తానికి శశికళ బెంగుళూరు కోర్టులో లొంగిపోవడానికి పయనమయ్యారు. అంతకుముందు మేనల్లుడు దినకరన్ ను పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించారు. అయితే ఆయన నియామకంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.
ఇక నిన్న సాయంత్రం గవర్నర్ ను కలిసిన అన్నాడీఎంకె శాసనసభాపక్ష నేత పళనిస్వామి తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే గవర్నర్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.

ఇన్నాళ్లు సుప్రీం తీర్పు కోసం వేచి చూస్తూ తాత్సారం చేసిన గవర్నర్.. ఇప్పుడు కూడా మౌనంగానే ఉండటం పట్ల బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.పళనిస్వామి ఇప్పటికే గవర్నర్ విద్యాసాగర్ రావుని కలిసి తనకు మద్దతు ఇస్తోన్న ఎమ్మెల్యేల లేఖను ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
అదే సమయంలో పన్నీర్ సెల్వం మాత్రం తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను ఇంతవరకు సమర్పించలేదని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు వేరే ఆప్షన్ ఏమి లేదని, పళనిస్వామితో ప్రమాణస్వీకారం చేయించాలని సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ చేశారు. ఇంకా ఆలస్యం చేస్తూ పోవడం తగదని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications