ప్రభుత్వ ఏర్పాటుకు మేం రెడీ..గవర్నర్ మమ్మల్ని ఆహ్వానించాలి: కాంగ్రెస్
ముంబై: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత అనూహ్య రీతిలో రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన మహారాష్ట్రలో ఇప్పుడిప్పుడే కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపించట్లేదు. రోజుకో రీతిన మలుపులు తిరుగుతోంది మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి భారతీయ జనతాపార్టీని ఆహ్వానించినప్పటికీ.. తగినంత బలం లేకపోవడంతో ఆ పార్టీ నాయకులు వెనుకాడుతున్నారు.
మహా మలుపులు..! మహారాష్ట్ర గడ్డపై ఊహించని సీఎం..!!
అదే సమయంలో- బీజేపీ తరువాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.శివసేన రహిత బీజేపీకి దక్కిన సీట్ల సంఖ్య 105. ఆ పార్టీ తరువాత సింగిల్ లార్జెస్ట్ గా ఉన్న కూటమి కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ (ఎన్సీపీ). మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమికి 98 స్థానాలు లభించాయి. బీజేపీ తరువాత అత్యధిక స్థానాలు గెలుచుకున్న కూటమి తమదేనని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మిలింద్ దేవ్ రా డిమాండ్ చేశారు.
288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో అధికారాన్ని అందుకోవాలంటే 145 సీట్ల సంఖ్యాబలం ఉండాలి. సీట్ల సర్దుబాటు చేసుకుని ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ.. ఫలితాలు వెలువడిన తరువాత శివసేన ఎదురు తిరగడంతో దిక్కుతోచని స్థితిలో ఉంది బీజేపీ.
అసెంబ్లీ కాల పరిమితి కూడా ముగిసింది. ఫలితంగా- దేవేంద్ర ఫడ్నవీస్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ జోక్యం చేసుకున్నారు. రాజకీయ సంక్షోభాన్ని నివారించడానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీని ఆహ్వానించారు. అయినప్పటికీ.. బీజేపీ ముందుకు రావట్లేదు. గవర్నర్ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్ప పడుతోంది.
అసెంబ్లీలో అత్యధిక స్థానాలను దక్కించుకున్న బీజేపీని ఆహ్వానించినప్పటికీ.. ఆ పార్టీ నాయకులు ముందుకు రావట్లేదని, 98 సీట్లతో రెండో స్థానంలో ఉన్న తమ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని మిలింద్ దేవ్ రా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ట్వీట్ చేశారు.