జయను చూశా, ఆరోగ్యం మెరుగుపడుతోంది: ఇన్చార్జి గవర్నర్ ప్రకటన
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆ రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ సీఎచ్ విద్యాసాగర్ రావు అన్నారు. గత పది రోజులుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను శనివారం రాత్రి ఆయన పరామర్శించారు. జయలలిత ఆరోగ్య వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
రాజ్ భవన్ నుంచి అధికారిక ప్రకటన
ఆమె ఆరోగ్యంపై సుమారు 35 నిమిషాలకు పైగా డాక్టర్లతో ఆయన మాట్లాడారు. తమిళనాడుకి ఇన్ఛార్జి గవర్నర్గా ఉన్న విద్యాసాగర్రావు శనివారం ముంబై నుంచి నేరుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయనతో పాటు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా ఉన్నారు.
జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జయలలిత కేబినెట్ సహచరులంతా అపోలో ఆసుపత్రికి క్యూకట్టారు. ఈ నేపథ్యంలో అపోలో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అనంతరం రాజ్భవన్కు గవర్నర్ బయల్దేరారు. రాజ్ భవన్ నుంచి ఆయన అధికారిక ప్రకటన చేశారు.
జయలలితను చూశా
జయలలితను తాను చూశానని అందులో పేర్కొన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సుమారు 35 నిమిషాల పాటు చర్చించానని చెప్పారు. ఆమె ఆరోగ్యం మెరుగవుతోందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్న జయలలిత కోలుకుంటున్నారని ఆయన తెలిపారు.
జయలలితకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి చైర్మన్ పత్రాప్ రెడ్డి తనకు వివరించారని గవర్నర్ తెలిపారు. ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులకు అభినందనలు చెప్పారు. ఆమె త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆయన ఆక్షాంక్షించారు.
తాజగా గవర్నర్ ప్రకటనతో జయలలిత ఆరోగ్యంపై అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానుల్లో కొంత మేరకు ఆందోళన తగ్గింది. ఇప్పటికే జయలలితకు చికిత్స అందించేందుకు విదేశాల నుంచి డాక్టర్లు వచ్చారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
జ్వరం, డీహైడ్రేషన్తో సెప్టెంబర్ 22న అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత
జ్వరం, డీహైడ్రేషన్తో సెప్టెంబర్ 22న చెన్నై అపోలో ఆసుపత్రిలో జయలలిత చేరారు. ఆమెకు లండన్ నుంచి వచ్చిన కన్సల్టెంట్ ఇంటెన్సివిస్ట్ డా. రిచర్డ్ జాన్ బేలే చికిత్స అందిస్తున్నారు. ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని రిచర్డ్ తెలిపారు. డాక్టర్ రిచర్డ్ పర్యవేక్షణలో మరో రెండు రోజుల పాటు జయలలితకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
అమ్మ ఆరోగ్యం బాగానే ఉంది: అన్నాడీఎంకే అధికార ప్రతినిధి పి.రామచంద్రన్
అమ్మ ఆరోగ్యం బాగానే ఉందని, చికిత్స జరుగుతోందని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి రామచంద్రన్ చెప్పారు. అమ్మకు లండన్ నుంచి వచ్చిన డాక్టర్ రిచర్డ్ చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మేం ప్రజలకు సమాధానం చెబుతాం కానీ, ప్రతిపక్షాలకు కాదని రామచంద్రన్ వ్యాఖ్యానించారు. వైద్యులు మాత్రమే అమ్మ ఆరోగ్యంగా మాట్లాడగలరని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications