ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పునర్వవస్థీకరణ -కొత్తగా రెండు కీలక పోస్టుల సృష్టికి కేంద్రం అనుమతి
ఇండియన్ ఆర్మీకి సంబంధించి మరో కీలక నిర్ణయానికి మోదీ సర్కార్ అనుమతించింది. గతేడాది కొత్తగా త్రివిధ దళాల అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ -సీడీఎస్) పోస్టును సృష్టించి, ఆ స్థానాన్ని బిపిన్ రావత్ కు కట్టబెట్టిన కేంద్రం.. తాజాగా అత్యున్నత స్థాయిలో మరో రెండు కొత్త పదవులను క్రియేట్ చేసేందుకు గురువారం అనుమతినిచ్చింది.
ఆర్మీ ప్రధాన కార్యాలయం పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (స్ట్రాటజీ) పోస్టును, అలాగే డైరెక్టర్ జనరల్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ పేరుతో మరో పోస్టును సృష్టించారు. ఆర్మీలో సీడీఎస్ తర్వాత ఉన్నతస్థాయి పోస్టులైన వీటి రూప కల్పనకు కేంద్ర అనుమతి ఇచ్చింది. కాగా,
కొత్తగా సృష్టించిన డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (స్ట్రాటజీ) ఈ పదవిని చేపట్టే తొలి అధికారి మిలిటరీ ఆపరేషన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ పరమజిత్ సింగ్ కావచ్చిన ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డైరెక్టర్ జనరల్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. డీజీఐడబ్ల్యూ కింద అదనపు డైరెక్టర్ జనరల్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ అధికారి ఉంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
2017లో చైనా సరిహద్దులోని డోక్లాంలో ప్రతిష్టంభన అనంతరం ఆర్మీ ఉన్నత ర్యాంకుల్లో మార్పులు చేయాల్సిన అవసరాన్ని మనవాళ్లు గుర్తించారు. ఆ క్రమంలోనే గతేడాది సీడీఎస్ ను ఇప్పుడు డిప్యూటీ చీఫ్ లను నియమించారు. భారత్, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తలు ఇంకా కొనసాగుతోన్న నేపథ్యంలో కేంద్రం నిర్ణయం కీలకంగా మారింది.