వాహనదారులకు కేంద్రం ఊరట! పెట్రోల్, డీజిల్ పై రూ.2 ఎక్సైజ్ సుంకం తగ్గింపు..
వాహనదారులకు శుభవార్త. పెట్రోల్, డీజిల్పై రూ.2 మేర బేసిక్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. తగ్గించిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి.
న్యూఢిల్లీ : వాహనదారులకు శుభవార్త. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. వీటి ధరలు రోజు రోజుకూ పెరుగుతుండటంపై ప్రజల్లో నిరసన వ్యక్తమవుతుండటంతో కేంద్రం నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది. జులై 4 తర్వాత పెట్రోల్ ధర రూ.7.8 పెరగ్గా.. డీజిల్ ధర రూ.5.7 మేర పెరిగింది.
రోజువారీ ధరల సమీక్ష విధానం తర్వాత భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వినియోగదారులకు కేంద్రం వూరట కల్పించింది. పెట్రోల్, డీజిల్పై రూ.2 మేర బేసిక్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. తగ్గించిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి.
బ్రాండెడ్, అన్బ్రాండెడ్ పెట్రోల్, డీజిల్కు ఈ తగ్గింపు వర్తించనుందని, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల్లో మార్పులే ఈ తగ్గింపునకు కారణమని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.
తాజాగా ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.70.88 కాగా.. డీజిల్ ధర రూ.59.14గా ఉంది. ప్రస్తుతం పెట్రోల్పై రూ.21.48, డీజిల్పై రూ.17.33 ఎక్సైజ్ సుంకం రూపంలో కేంద్రానికి ఆదాయం వస్తోంది.