కేజ్రీవాల్ పార్టీకి చిక్కులు: విరాళాలపై ప్రభుత్వం విచారణ
ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం కాంగ్రెసు పార్టీ నాయకురాలు, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఎఎపికి వస్తున్న విరాళాల పైన ప్రశ్నించారు. అవినీతిపై పోరాటం అంటున్న ఆ పార్టీకి నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయో చెప్పాలన్నారు. ఆ పార్టీ తనను అబద్దాలకోరు అంటే, ఆ పార్టీని తాను దొంగగా చెబుతానన్నారు. తనను అబద్దాలకోరుగా చెప్పేందుకు ఏమైనా ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు.
తన పార్టీకి విదేశాల నుండి విరాళాలు వస్తున్నాయన్న అంశంపై కేజ్రీవాల్ అప్పుడే స్పందించారు. విరాళాల పైన విచారణ జరుపుకోవచ్చునన్నారు. అయితే తమ పార్టీ విరాళాలతో పాటు బిజెపి, కాంగ్రెసు పార్టీల విరాళాల పైన కూడా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎఎపి నాయకుడు మనిష్ సిసోడియా మాట్లాడుతూ... విరాళాల పైన తాము నిబంధనలు ఉల్లంఘించడం లేదని, అంతా పారదర్శకంగా జరుగుతోందన్నారు. విరాళాల విషయం పార్టీ వెబ్ సైట్లో పెట్టామని తెలిపారు. తాము భారతీయుల నుండి, భారత దేశంలో సిటిజన్షిప్ ఉన్న వారి నుండి మాత్రమే విరాళాలు సేకరిస్తున్నామని మరో నేత ప్రశాంత్ భూషణ్ తెలిపారు.
కాగా, తమ పార్టీకి నవంబర్ 8వ తేదీ వరకు 63వేల మంది నుండి 19కోట్ల రూపాయల విరాళాలు అందాయని ఎఎపి ప్రకటించింది. తమకు పది రూపాయల నుండి లక్షల వరకు విరాళాలు వచ్చాయని, రిక్షా కార్మికుల నుండి పారిశ్రామికవేత్తల వరకు విరాళాలు వచ్చాయన్నారు.