సుప్రీంకు నల్ల కుబేరుల జాబితా: 627 మంది పేర్లు
న్యూఢిల్లీ: నల్లధనం కుబేరుల జాబితాను కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. 627 మంది పేర్లతో ఆ జాబితాను సుప్రీంకోర్టుకు సమర్పించింది. నల్ల కుబేరుల జాబితా పైన కేంద్రానికి సుప్రీం కోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. విదేశాల్లో డబ్బు దాచిన వారందరి పేర్లు బయట పెట్టాలని సూచించింది. బుధవారంలోగా జాబితా సమర్పించాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం 627 మంది పేర్లతో జాబితాను సుప్రీంకోర్టుకు సమర్పించింది. విదేశీ బ్యాంకుల్లో వారందరికీ ఖాతాలున్నాయి. అటార్నీ జనరల్ ముకుల్ రహతోగి నల్లధనం కుబేరుల జాబితాతో కూడిన మూడు సెట్ల డాక్యుమెంట్లను సుప్రీంకోర్టుకు సమర్పించారు.
సీల్డ్ కవర్లలో జాబితాను ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఒక జాబితాలో నల్లధనం కలిగి ఉన్నవారు పేర్లు, రెండో జాబితాలో విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారి పేర్లు, మూడో జాబితాలో నల్లధనం కేసు వివరాలు ఉన్నాయి. నల్లధనం కేసు దర్యాప్తునకు సుప్రీంకోర్టు సిట్కు 2015 మార్చి వరకు గడువు ఇచ్చింది. సిట్ దర్యాప్తు నివేదికును నవంబర్ లోగా తమకు సమర్పించాలని ఆదేశించింది. కేసు విచారణను డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.
సీల్డ్ కవర్లను సిట్ అథ్యక్ష, ఉపాధ్యక్షులే తెరవాలని సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు జాబితా సమర్పించామని రోహతగీ మీడియాతో చెప్పారు. జాబితా వివరాలను గోప్యంగా ఉంచాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. సీల్డ్ కవర్లో జాబితాను అందజేశామని, జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయో చెప్పలేమని రోహతగీ అన్నారు. అయితే, జాబితాలో బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు, ప్రముఖుల పేర్లు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
వారి పేర్లను బయటపెట్టాలా, లేదా అనే విషయం సుప్రీంకోర్టుకు వదిలేస్తున్నామని, ఎవరిని కూడా రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నించడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.












Click it and Unblock the Notifications