ఉద్యోగాలు కల్పిస్తేనే దేశం ఆర్థికంగా పుంజుకుంటుంది: రఘురాంరాజన్
మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ల ప్రభుత్వం నుంచి వారు తీసుకొచ్చిన సంస్కరణల గురించి మోడీ సర్కారు తెలుసుకుని అమలు చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. దావోస్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రఘురాంరాజన్... రాజకీయ నాయకత్వం అనేది దేశంలో సంస్కరణలు అమలు అయ్యేలా ఏకాభిప్రాయం తీసుకువచ్చేందుకు ఉపయోగపడాలని రాజన్ అన్నారు. ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వాలకు ప్రధాని మంత్రిగా, ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన వారినుంచి ప్రస్తుత ప్రభుత్వం నేర్చుకోవాలని రాజన్ అభిప్రాయపడ్డారు.

కొత్త పాలసీలు క్షేత్ర స్థాయిలో అమలు చేయడం లేదు
అన్నీ తమ చేతుల్లోనే పెట్టుకుని దేశాన్ని పాలించాలంటే ప్రభుత్వాలు సంస్కరణలు అమలు చేయలేవని అన్నారు రాజన్. అలాంటి ప్రభుత్వాలు నాయకత్వాన్ని అందిచగలవేమో కానీ... సంస్కరణలు అమలు చేయలేవని చెప్పారు. ప్రభుత్వం విధానాలు, పథకాలు తీసుకొస్తున్నాయి కానీ వాటిని క్షేత్ర స్థాయిలో అమలు చేయలేకపోతున్నాయని అభిప్రాయపడ్డారు. రాజన్ ఎవరి పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినప్పటికీ చెప్పాల్సిన విషయాలు స్పష్టంగా చెప్పేశారు. అంతేకాదు రాజన్ దేశ ఆర్థిక వ్యవస్థ, లోక్సభ ఎన్నికలు, రైతుల ఆందోళనపై కూడా మాట్లాడారు.

ప్రజలు మార్పును కోరుకుంటున్నారు
దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని అందుకే ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు రాజన్ చెప్పారు. ఈ క్రమంలోనే భారత ఓటర్లు రానున్న ఎన్నికల్లో తెలివిగా వ్యవహరించబోతున్నారని జోస్యం చెప్పారు. ప్రస్తతం ప్రభుత్వంలో ప్రజలు అసహనానికి గురవుతున్నారని, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలపై ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకున్నారని రాజన్ వెల్లడించారు.

మోడీ ప్రభుత్వం గురించి...
మోడీ ప్రభుత్వం గురించి చెప్పాలంటే జీఎస్టీ, రుణ ఎగవేతదారులపై కఠిన చట్టాలు తీసుకురావడాన్ని ప్రశంసించిన రాజన్, అదేసమయంలో కార్మిక , భూ సంస్కరణలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు రాజన్. భూసేకరణ చట్టంలో ఉన్నట్లుగా భూమి సేకరించబడటం లేదని బలవంతంగా భూమిని ప్రభుత్వం లాక్కుంటోందని ధ్వజమెత్తారు. ఇక భారత్ ఆర్థిక వ్యవస్థ నిలబడాలంటే ఉద్యోగాలు కల్పించాలని వెల్లడించారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే ఆర్థిక వ్యవస్థలోకి భారత్ దూసుకెళ్లాలని అప్పుడే వృద్ధి రేటు పెరుగుతుందని రాజన్ చెప్పారు.

ఆర్బీఐ గవర్నర్ స్థానం గురించి...
ఆర్బీఐ గవర్నర్గా ఒక వ్యక్తిని నియమించాక ప్రభుత్వ జోక్యం ఉండకూడదని చెప్పారు రఘురాం రాజన్. ఒక వ్యక్తి ఆర్బీఐ గవర్నర్గా నియమించాక అతను చేయాల్సిన పనులు బాగా తెలిసి ఉంటాయన్నారు. అతను తీసుకునే నిర్ణయాల్లో ఇతరుల జోక్యం ఉండకూడదని చెప్పారు. కొందరు సెక్రటరీలు ఆర్బీఐ గవర్నర్ కంటే తమకే ఎక్కువ తెలుసనే భావనలో ఉంటారని అది సరికాదన్నారు. అందుకే ఆర్బీఐ గవర్నర్ అంటే ఏమిటి, ఆ స్థానానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అనేదానిపై ముందుగానే స్పష్టత ఇస్తే బాగుంటుందన్నారు. ఆర్బీఐ ప్రభుత్వ పరిపాలనలో భాగంగా పనిచేస్తుందని చెప్పిన మాజీ ఆర్భీఐ గవర్నర్.. అదే సమయంలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వాతంత్ర్యం ఆర్బీఐకు ఇవ్వాలని సూచించారు.












Click it and Unblock the Notifications