పెళ్లి సంబరాల్లో కాల్పులు: వరుడు మృతి
లక్నో: ఉత్తర్ప్రదేశ్లోని సీతాపూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. మరి కొద్దిసేపట్లో పెళ్లి చేసుకోబోతున్న ఓ యువకుడు తుపాకీ గుండుకి బలయ్యాడు. పెళ్లి సంబరాల్లో మునిగిన ఓ వ్యక్తి గాల్లోకి కాల్పులు జరపడంతో బుల్లెట్ పెళ్లికొడుక్కే తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
వరుడు గుర్రంపై ఊరేగింపుగా పెళ్లికి తరలివస్తుండగా అతని బంధువుల్లో ఓ వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపాడు. అది కాస్తా పెళ్లికొడుకు తలకు తగిలింది. యువకుడు అక్కడే కూలబడిపోవడంతో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం లక్నో తరలిస్తుండగా దారిలోనే ప్రాణాలు విడిచాడు.
కాల్పులు జరిపిన వ్యక్తి అదృశ్యం కాగా, పోలీసులు ఘటనాస్థలిని సందర్శించి విచారణ చేపట్టారు. పెళ్లికొడుకు మృతి ఇరు కుటుంబాల్లోనూ విషాదాన్ని నింపింది. అయితే పెళ్లి కొడుకును కావాలనే చంపాడా? లేక పొరపాటున జరిగిందా? అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
'సౌండ్ తగ్గించమన్నందుకు పోలీసునే చంపేశారు
చుట్టు పక్కల వారికి ఇబ్బంది కలుగుతోందని మ్యూజిక్ సౌండ్ తగ్గించమని సూచించినందుకు కుటుంబమంతా కలిసి ఓ పోలీసునే చంపేశారు. ఉత్తర్ప్రదేశ్ బదౌన్లోనిఘడౌలి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన జగత్పాల్ బుధవారం రాత్రి తన ఇంట్లో పెద్ద సౌండ్తో డీజే మ్యూజిక్ పెట్టాడు. చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలగడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఇద్దరు పోలీసులు అతని ఇంటికి చేరుకుని మ్యూజిక్ ఆపమని అడిగారు.
దీంతో ఆగ్రహానికి గురైన జగత్పాల్ అతని భార్య, పిల్లలు గొడ్డళ్లు, కర్రలతో పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఒక పోలీసు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. నిందితులపై కేసు నమోదైందని ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.