మోడీ మైండ్ గేమ్: కొత్త వారికి అవకాశం, కాంగ్రెస్ రెబల్స్ కు సీట్లు, హార్దిక్ పటేల్ కు షాక్, చాన్స్ !
గుజరాత్ 2017 శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. శుక్రవారం 70 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ పటీదార్, బీసీలను ఆకర్షించింది.
Recommended Video
అహ్మదాబాద్: గుజరాత్ 2017 శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. శుక్రవారం 70 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ పటీదార్, బీసీలను ఆకర్షించింది. ఎన్నడూ లేని విధంగా పటీదార్, బీసీలకు టిక్కెట్ల పంపిణిలో ప్రధాన్యం కల్పించారు.
బీజేపీ విడుదల చేసిన మొదటి జాబితాలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్ జితూ వాఘానీలతో సహా ఐదు మంది కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మొదటి జాబితాలో బీజేపీకి చెందిన 49 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీ చెయ్యడానికి అవకాశం కల్పించారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్
ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ సారి ఎన్నికల్లో పోటీ చెయ్యడాని బీజేపీ అధిష్టానం నిరాకరించింది. గుజరాత్ లో తొలి దశలో డిసెంబర్ 9వ తేదీ జరుగుతున్న ఎన్నికల్లో 89 శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. ఇటీవల పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐపీఎస్ అధికారి బరాండకు భిలోడా శాసన సభ నియోజక వర్గం (ఎస్టీ) నుంచి పోటీ చెయ్యడానికి అవకాశం కల్పించారు.
మోడీ మైండ్ గేమ్
పటీదార్ వర్గాలకు 15 సీట్లు, బీసీలకు 26 సీట్లు, ఎస్సీలకు మూడు, ఎస్టీలకు 11 సీట్లు కేటాయించారు. బీసీల్లో ఎక్కువ సీట్లు ఠాకూర్ వర్గానికి కేటాయించామని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం గుజరాత్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న 16 మందికి సీట్లు కేటాయించారు.
సీఎం, డీసీఎం, బీజేపీ గుజరాత్ చీఫ్
రాజ్కోట్ పశ్చిమ నియోజక వర్గం నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మెహసనా నియోజక వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి నితిన్, భావ్ నగర్ పశ్చిమ నియోజక వర్గం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జితూ వాఘానీలను పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ రెబల్స్
కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన శాసన సభ్యులు రాఘవ్ జీ పటేల్, ధర్మేంద్ర సిన్హా జడేజా, రామ్ సిన్హా పార్మర్, మన్ సిన్హ్ చౌహాన్, సీకే రవోల్జీలకు తొలి జాబితాలో బీజేపీ అవకాశమిచ్చింది. రాష్ట్రపతి ఎన్నికలతో పాటు రాజ్యసభ ఎన్నికల్లోను వీరందరూ బీజేపీకి మద్దతిచ్చారు.
మహిళలకు ప్రాధాన్యత !
బీజేపీ మొదటిజాబితాలో నలుగురు మహిళలు ఉన్నారని, అన్ని కులాలు, వర్గాలకు సమ ప్రాధాన్యం కల్పించేందుకు ప్రయత్నించామని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మొదటి జాబితాను ఖరారుచేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్తో పాటు, ఇతర పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.