బీజేపీ బూత్ క్యాప్చరింగ్ - కాంగ్రెస్ అభ్యర్థిపై ..!!
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు పోలంగ్ ఆరంభం కానుంది. సాయంత్రం వరకు కొనసాగుతుంది. 1వ తేదీన తొలి విడత పోలింగ్ ముగిసింది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటికే పోలింగ్ను ముగించుకున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిసి ఓట్లను లెక్కిస్తారు. గుజరాత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం, ఈ రెండు రాష్ట్రాల్లో భారతీయ జనత పార్టీ అధికారంలో ఉండటం వల్ల ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టీ నిలిచింది.
గుజరాత్లో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 182. వాటికి కేంద్ర ఎన్నికల సంఘం రెండు దశల్లో పోలింగ్ నిర్వహిస్తోంది. తొలి విడతలో 19 జిల్లాల్లోని 89 స్థానాలకు గురువారం పోలింగ్ ఇదివరకే ముగిసింది. దక్షిణ గుజరాత్, కఛ్, సౌరాష్ట్ర రీజియన్లలోని జిల్లాలు ఇందులో ఉన్నాయి. మిగిలిన 93 స్థానాలకు ఇవ్వాళ పోలింగ్ జరుగనుంది. సెంట్రల్, నార్త్ గుజరాత్లల్లో గల 14 జిల్లాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

కాగా- కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి కాంతి ఖరాడిపై దాడి ఘటనతో కలకలం చెలరేగింది. బనస్కాంత జిల్లాలోని దంత అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన మరోసారి పోటీ చేస్తోన్నారు. ఆదివారం రాత్రి బమోదరాకు వెళ్తోన్న తనపై బీజేపీ గూండాలు దాడి చేశారని కాంతి ఖరాడి చెప్పారు. తనపై పోటీ చేస్తోన్న బీజేపీ అభ్యర్థి లధు పర్ఘీ, ఆయన అనుచరులు ఎల్ కే బరాద్ ఆయన సోదరుడు వడన్జీ భాయ్ తదితరులు తన కారును అడ్డగించి, దాడి చేశారని, కత్తులతో బెదిరించారని ఆరోపించారు.
తాము వెనుదిరిగి దంతా టౌన్కు వస్తోన్న సమయంలో కూడా లధు పర్ఘీ తన అనుచరులతో వేర్వేరు వాహనాల్లో తమను వెంబడించారని, కత్తులు ఝళిపిస్తూ తమను భయభ్రాంతులకు గురి చేశారని విమర్శించారు. తాను సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గంలో తిరగనివ్వట్లేదంటూ మండిపడ్డారు. బీజేపీ అప్రజాస్వామ్య వైఖరికి ఇది నిదర్శనమని ధ్వజమెత్తారు. బీజేపీ గూండాలు బూత్ క్యాప్చరింగ్కు పాల్పడుతున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ ఈ దాడి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఓ ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధిపై బీజేపీ గూండాలు దాడి చేశారని విమర్శించారు. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. దంత నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంతి ఖరాడి.. ఈ ఎన్నికల్లో కూడా గెలవబోతోన్నారని, ఆ అక్కసుతోనే బీజేపీ ఈ దాడికి పాల్పడిందని బనస్కాంత జిల్లా ఇన్ఛార్జ్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జిగ్నేష్ మేవాణి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications