పదో తరగతి హిందీ పేపర్ లీక్.. ఆన్సర్ కూడా వైరల్.. ఎక్కడంటే
పదో తరగతి అంటే బోర్డు పరీక్షే.. అన్నీ జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా రాష్ట్రాల్లో ఎస్ఎస్సీకి వ్యాల్యూ ఉంటుంది. అదీ స్టేట్ సిలబస్.. లేదంటే సీబీఎస్ఈ అయినాసరే.. కానీ గుజరాత్లో మాత్రం విచిత్ర పరిస్థితి.. అంటే బోర్డు పరీక్ష పేపర్ కాదు.. జవాబులు కూడా కనిపించాయి. పేపర్ లీక్ కావడంతో.. అదీ సమాధానాలు కూడా షేర్ చేశారు. ఇంకేముంది అదీ తెగ వైరల్ అవుతుంది.
గుజరాత్లో పదో తరగతి హిందీ పేపర్ లీక్ అయ్యింది. ప్రశ్నాపత్రంతోపాటు జవాబులు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తుయి. గుజరాత్లో పదో తరగతి బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. శనివారం హిందీ పరీక్ష నిర్వహించారు. ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ అయ్యింది. ఒకవైపు విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా మరోవైపు ప్రశ్నాపత్రంతోపాటు జవాబులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గుజరాత్ ఎడ్యుకేషన్ బోర్డు విషయంపై దృష్టిసారించింది. ఘటనపై దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు. పదో తరగతి హిందీ పేపర్ లీక్ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తరచుగా పరీక్షల పేపర్లు లీక్ అవుతున్నాయని విమర్శించింది. గతంలో రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్లు మాత్రమే లీక్ అయ్యేవని, ఇప్పుడు పదవ తరగతి బోర్డు పరీక్షలు కూడా లీక్ అవుతున్నాయని ఆరోపించింది. దీనికి విద్యాశాఖ మంత్రి జితు వాఘని బాధ్యత వహించాలని కోరింది. ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
వాస్తవానికి పేపర్ లీక్ ఘటన ఆషామాషీ కాదు. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్కు సంబంధించింది. చాలా మంది కష్టపడి చదువుతారు. కొందరు స్వార్థం కోసం లీక్ చేస్తే.. చదివిన వారికి అన్యాయం జరుగుతుంది. కాపీ కొట్టి రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చి. చదివినవారు నష్టపోయే ప్రమాదం ఉంది. దీనిపై గుజరాత్ విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. విద్యార్థుల భవితను భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతయినా ఉంది.